దేశంలోని దక్షిణాది రాష్ట్రాలు ఎలా ఉన్నప్పటికీ.. ప్రస్తుతం ఉత్తరాది రాష్ట్రాలు సహా.. పూర్వోదయ రాష్ట్రాల్లో మాత్రం ప్రజలు అల్లాడుతున్నారా? అంటేఔననే సమాధానమే వినిపిస్తోంది. ఉత్తరాఖండ్, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్ సహా.. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అక్కడి ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలు.. పెను సంచలనంగా మారింది. ఈ వ్యవహారం జాతీయ మీడియాలో కూడా పెను దుమారం రేపుతోంది. అయితే.. బలమైన ప్రభుత్వాలు కావడం.. కేంద్ర కూడా బలగాలను సిద్ధం చేసి ఏం జరిగినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్న నేపథ్యంలో ఉద్యమాలు ఇప్పుడిప్పుడే మొదలయ్యాయి.
ఏం జరుగుతోంది?
ఇటీవల పశ్చిమ బెంగాల్లో అధికారంలోకి వచ్చిన బీజేపీ.. వచ్చీ రాగానే సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని మదర్సాలలో వందేమాతరం గేయాన్ని ఆలపించాలని తేల్చి చెప్పింది. ఇది వివాదానికి దారి తీసింది. అయినా.. ప్రభుత్వం తనను తాను సమర్ధించుకుంది. ఇక, ఢిల్లీలోనూ ఇదే ఆదేశాలు ఇచ్చారు. యూపీలో గత కొన్నాళ్లుగా కూడా ఈ నిర్ణయం అమలవుతోంది. మరోవైపు.. ఆయా రాష్ట్రాల్లో బక్రీద్కు సంబంధించి కూడా కఠిన నిబంధనలు విధించారు. యూపీ, ఢిల్లీ, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్ సహా.. బీజేపీ పాలిత గుజరాత్లోనూ చాలా కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
బక్రీద్ పండుగను పురస్కరించుకుని జంతు బలులపై మార్గదర్శకాలను జారీ చేశారు. దీని ప్రకారం.. బహిరంగ ప్రదేశాలలో జంతు బలులను నిషేధించారు. ఇలా చేయడం చట్టవిరుద్ధమని ప్రభుత్వాలు స్పష్టం చేశాయి. ఈ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై తక్షణమే క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ముఖ్యమంత్రులు ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా జంతువుల వ్యర్థాలను మురుగు కాలువలు లేదా బహిరంగ ప్రదేశాలలో పారవేయాడాన్ని కూడా నిషేధించారు. ప్రస్తుతం ఉన్న పశు సంరక్షణ, జంతు హింస చట్టాల ప్రకారం ఆవులు, దూడలు, ఒంటెలు ఇతర జంతువులను వధించడాన్ని నిషేధించినట్టు పేర్కొన్నారు.
అదేవిధంగా రోడ్లపై నమాజ్ను దాదాపు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పూర్తిగా నిషేధించారు. ఎట్టి పరిస్థితిలోనూ బహిరంగ నమాజ్లు చేయడానికి వీల్లేదని ప్రభుత్వాలే తేల్చి చెప్పడం గమనార్హం. అంతేకాదు.. ఇలా చేయడాన్ని రాజ్యాంగ విరుద్ధంగా కూడా పశ్చిమ బెంగాల్ ప్రకటించింది.
రహదారులనేవి ప్రజల అవసరాల కోసం నిర్మించినవని.. ఇవి ఒక వర్గం.. బల ప్రదర్శనలకు వేదికలుగా మారకూడదని అభిప్రాయపడింది. ఇక, ఉత్తరాఖండ్ సహా.. యూపీలోనూ నిషేధించారు. యూపీలో ఇటీవల రోడ్డుపై నమాజ్ చేసిన వ్యక్తిపై హత్యానేరం కింద కేసు నమోదు చేశారు. దీనిని ప్రభుత్వం సమర్థించుకుంది. ఇలా.. ఆయా రాష్ట్రాల్లో కల్లోల పరిస్థితులు నెలకొంటున్నాయని జాతీయ మీడియా చెబుతుండడం గమనార్హం.
Gulte Telugu Telugu Political and Movie News Updates