పొద్దున్నే రంగంలోకి దిగిన పవన్ కల్యాణ్

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పొద్దుపొద్దున్నే కార్యరంగంలోకి దిగిపోయారు. సోమవారం తన పర్యటనలో భాగంగా ఆదివారం రాత్రికే రాజమహేంద్రవరం చేరుకున్న పవన్… సోమవారం ఉదయం 7 గంటలు దాటకముందే రంగంలోకి దిగిపోయారు.

రాజమహేంద్రవరంలోని గోదావరి పుష్కర ఘాట్ల పరిశీలన కోసం ఆయన సోమవారం నగరంలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ పర్యటన కోసం ఆదివారం రాత్రికే నగరం చేరుకున్న ఆయనకు స్థానిక నేతలు, అధికారులు ఘన స్వాగతం పలికారు.

ఆదివారం రాత్రి రాజమహేంద్రవరంలోనే బస చేసిన పవన్… సోమవారం ఉదయం 7 గంటలకే తన పర్యటనను ప్రారంభించారు. స్థానిక అధికారులు వెంట రాగా… పవన్ కల్యాణ్ రాజమహేంద్రవరం పరిధిలోని గోదావరి పుష్కర ఘాట్ల పనుల పరిశీలనను మొదలుపెట్టారు.

ఈ సందర్భంగా పుష్కర ఘాట్ల ఏర్పాటుకు సంబంధించి కొనసాగుతున్న పనులను ఆయన పరిశీలించారు. ఈ పనుల కారణంగా గోదావరి జలాలు కాలుష్యం బారిన పడకుండా తీసుకుంటున్న జాగ్రత్తలపై పవన్ ప్రత్యేకంగా దృష్టి సారించారు.

ఈ సందర్భంగా నదిలో పేరుకుపోతున్న కాలుష్య కారకాలను పరిశీలించిన పవన్ కల్యాణ్… వాటిని తొలగించే చర్యలపై అధికారులతో చర్చించారు. గోదావరి తీరాన్ని కాలుష్య రహితంగా ఉంచేందుకు అవసరమైన చర్యలు, వాటి అమలు తీరుపైనా పవన్ దృష్టి సారించారు.

పుష్కరాలు సమీపిస్తున్న నేపథ్యంలో కాలుష్య రహితంగా ఆయా ప్రాంతాలను తీర్చిదిద్దాలన్న దిశగా పవన్ సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పవన్ పర్యటన నేపథ్యంలో రాజమహేంద్రవరంలో ప్రస్తుతం కోలాహలం నెలకొంది.