ష‌ర్మిల స‌మ‌యం కోసం వెయిటింగా..?

వైసీపీ అధినేత జ‌గ‌న్ ఇటీవ‌ల చేసిన వ్యాఖ్య‌లు.. రాజ‌కీయ చ‌ర్చ‌కు, ర‌చ్చ‌కు కూడా దారితీశాయి. ఫ్యాక్ష‌న్ రాజ‌కీయాలు.. గ‌న్ క‌ల్చ‌ర్ గురించి.. మాట్లాడిన జ‌గ‌న్‌.. ఇవి టీడీపీకి సొంత‌మ‌ని వ్యాఖ్యానించారు. అదేస‌మయంలో త‌మ తాత‌, తండ్రులు చ‌నిపోయినా.. తాను శాంతి కోసం పాకులాడుతున్నాన‌ని చెప్పారు. అందుకే.. నాడు త‌మ తాత‌ను చంపినోళ్లు కూడా.. ప్ర‌స్తుతం ప్ర‌శాంతంగా జీవిస్తున్నార‌ని తెలిపారు. ఈ వ్యాఖ్య‌లే తీవ్ర దుమారం రేపాయి.

గ‌త నాలుగు రోజులుగా ప్ర‌ధాన మీడియాల్లో టీడీపీ నేత‌లు ఎదురు చేయ‌డం.. తీవ్ర విమ‌ర్శ‌లు చేయ‌డం.. వంటివి క‌నిపిస్తున్నాయి. ముఖ్యంగా వైఎస్ కుటుంబం ర‌క్త చ‌రిత్ర ఇదీ.. అంటూ పేర్ల పార్థ‌సార‌థిరెడ్డి చేసిన వ్యాఖ్య‌లు క‌డ‌ప జిల్లాతో పాటు.. రాష్ట్ర వ్యాప్తంగా జోరుగా వైర‌ల్ అవుతున్నాయి. అయితే.. ఇంత జ‌రుగుతున్నా.. వైఎస్ కుటుంబానికే చెందిన కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్య‌క్షురాలు.. వైఎస్ ష‌ర్మిల పెద‌వి విప్ప‌లేదు. మారు మాట్లాడ‌లేదు.

మ‌రి ఆమె ఎందుకు మౌనంగా ఉంటున్నార‌న్న‌ది ఆస‌క్తిగా మారింది. వాస్త‌వానికి వైసీపీ ఏ కామెంట్లు చేసినా .. ముఖ్యంగా త‌మ బాబాయి వివేకా హ‌త్య గురించి జ‌గ‌న్ ఎలాంటి కామెంట్లు చేసినా.. ష‌ర్మిల వెంట‌నే రియాక్ట్ అవుతారు. అలాంటిది ఇప్పుడు ఆమె మౌనంగా ఉండిపోయారు. క‌నీసం.. ఒక స్టేట్‌మెంటు కూడా ఆమె ఇవ్వ‌లేదు. పోనీ.. విదేశాల్లో ఉన్నారా? అంటే.. ఆమె త‌ర‌చుగా గ‌త రెండు రోజులుగా విజ‌య‌వాడ‌కు వ‌చ్చిపోతున్నారు. అయిన‌ప్ప‌టికీ.. ఈ విష‌యాలేవీ తన‌ దృష్టికి రాలేద‌న్న‌ట్టుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

రీజ‌నేంటి..
వైఎస్ కుటుంబం నుంచి ష‌ర్మిల మాట్లాడాల్సి వ‌స్తే.. త‌న సోద‌రుడితో విభేదించినా.. తాత‌, తండ్రి, బాబా యిల‌ను స‌మ‌ర్ధించాల్సి ఉంటుంది. త‌ద్వారా.. ఆమె చేసే వ్యాఖ్య‌లు ప‌రోక్షంగా వైసీపీకి, ముఖ్యంగా త‌న సోద‌రుడు జ‌గ‌న్ చేసిన వ్యాఖ్య‌ల‌కు స‌మ‌ర్థ‌న‌గా ఉంటాయి.

దీనివ‌ల్ల ఇప్ప‌టి వ‌ర‌కు జ‌గ‌న్‌పై ఆమె చేస్తున్న రాజ‌కీయ‌, వ్య‌క్తిగ‌త పోరాటం తుడిచి పెట్టుకుపోయే ప్ర‌మాదం ఉంది. ఈ నేప‌థ్యంలోనే ఆమె మౌనంగా ఉంటున్న‌ట్టు రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ న‌డుస్తోంది. స‌మ‌యంచూసుకుని స్పందించే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు.