దేశంలో బాబు `కీ`ల‌క రోల్ ..!

దేశంలో ఏపీ సీఎం చంద్ర‌బాబు గురించి తెలియని వారు లేరు. విజ‌న్ ఉన్న ముఖ్య‌మంత్రిగానే కాకుండా.. 75 ఏళ్ల వ‌య‌సులో కూడా ఆయ‌న చాలా యాక్టివ్‌గా 25 ఏళ్ల న‌వ‌యుకుడిలా ఛెంగు ఛెంగున కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటున్నారు. దాదాపు రెండు నుంచి 3 గంట‌ల‌పాటు నిల‌బ‌డే కార్య‌క్ర‌మాల్లో ప్ర‌సంగాలు కూడా దంచి కొడుతున్నారు. దీంతో చంద్ర‌బాబు స్టామినా గురించి.. త‌ర‌చుగా జాతీయ మీడియాలోనూ చ‌ర్చ న‌డుస్తోంది. ఇక‌, ఎన్డీయే పాలిత రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల జాబితాలోనూ చంద్ర‌బాబు ముందున్నారు.

ఆయ‌న దూకుడు అంతా ఇంతాకాదు. భ‌విష్య‌త్తును ముందు గానే అంచ‌నా వేసుకుని దాని ప్ర‌కారం నిర్ణ‌యాలు తీసుకుంటారు. ఈ క్ర‌మంలోనే గ‌తంలోనే ప్ర‌ధాని స‌హా.. అనేక మంది జాతీయ నాయ‌కులు చంద్ర‌బాబు సేవ‌ల‌ను వినియోగించుకున్నారు. 2016లో దేశంలో పెద్ద నోట్ల ర‌ద్దు నేప‌థ్యంలో చంద్ర‌బాబు నేతృత్వంలోనే మోడీ క‌మిటీని వేశారు. దేశంలో త‌ర్వాత తీసుకురా వాల్సిన మార్పుల‌పై ఈ క‌మిటీ అధ్య‌యనం చేసింది.

ఈ క‌మిటీకి చంద్ర‌బాబు నేతృత్వం వ‌హించారు. ప్ర‌స్తుతం డిజిట‌ల్ ట్రాన్సాక్షాన్స్‌.. స‌హా.. యూపీఐ సేవల‌ను మ‌రింత విస్త‌రించేందుకు నాడు ఈ క‌మిటీనే స‌ల‌హాలు సూచ‌న‌లు ఇచ్చింద‌ని.. ఇటీవ‌ల కేంద్ర ఆర్థిక మంత్రి సైతం వివ‌రించారు. కాగా.. ఇప్పుడు మ‌రోసారి చంద్ర‌బాబుకు మంచి అవ‌కాశం చిక్కింది. దేశంలోని అన్ని పార్టీల‌ను.. ముఖ్యంగా.. ఎన్డీయేత‌ర పార్టీల‌ను ఐక్యంగా ముందుకు న‌డిపించేందుకు.. ఒకే తాటిపైకి తీసుకువ‌చ్చేందుకు కేంద్రం ప్ర‌య‌త్నాలు చేస్తోంది.

ప్ర‌ధానంగా.. పార్ల‌మెంట‌రీ నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న విష‌యంలో కాంగ్రెస్ స‌హా.. ఇత‌ర ఎన్డీయేత‌ర పార్టీలు వ్య‌తిరేకిస్తున్నాయి. గత నెల‌లో జ‌రిగిన పార్ల‌మెంటు స‌మావేశాల్లో ఈ బిల్లు వీగిపోయింది. అయితే.. జూన్- జూలై మ‌ధ్య కాలంలో జ‌రిగే స‌భ‌ల్లో.. ఈ బిల్లును ఆమోదించాల‌ని కేంద్రం నిర్ణ‌యించింది.

అయితే .. ప్రత్యర్థి పార్టీల‌ను ఒప్పించ‌డం.. అంద‌రినీ ఏక‌తాటిపైకి తీసుకురావ‌డం.. అనే ప్ర‌ధాన క్ర‌తువును చంద్ర‌బాబుకే అప్ప‌గించాల‌ని ప్ర‌ధాని నిర్ణ‌యించిన‌ట్టు తెలిసింది. ఇదే జ‌రిగితే.. చంద్ర‌బాబు నేతృత్వంలో పార్టీలు ఏక‌తాటిపైకి వ‌చ్చే అవ‌కాశం ఉంటుంది. త‌ద్వారా ప్ర‌ధాన కార్య‌క్ర‌మం నిర్విఘ్నంగా జ‌రుగుతుంద‌ని అంచ‌నా వేస్తున్నారు.