విద్యాలయాల్లో మత విశ్వాసాలకు సంబంధించిన వ్యవహారాలు దక్షిణాది రాష్ట్రం కర్ణాటకలో నిత్యం వివాదాస్పదమే అవుతున్నాయి. గతంలో పాఠశాలలకు ముస్లిం విద్యార్థినీలు బురఖా ధరించి రావద్దనే వ్యవహారం దేశవ్యాప్తంగా పెను కలకలమే రేపిన సంగతి తెలిసిందే. తాజాగా పాఠశాలల్లో విద్యార్థులు హాజరు పలికే సమయంలో ‘ఎస్ సర్’ కు బదులుగా ‘జై శ్రీరామ్’ అని పలకాలంటూ ఓ బీజేపీ నేత చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ఈ వ్యాఖ్యలను సమర్ధిస్తూ బీజేపీ ఎమ్మెల్యే గాలి జనార్థన్ రెడ్డి మరోమారు వార్తల్లో నిలిచారు.
ఓబుళాపురం మైనింగ్ కేసులో దోషిగా తేలి జైలు శిక్ష అనుభవించి వచ్చిన గాలి జనార్థన్ రెడ్డి… కాస్తంత సైలెంట్ గానే వ్యవహారాలు చక్కబెట్టుకుంటున్నారు. గత కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో గంగావతి అసెంబ్లీ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన గాలి విజయం సాధించారు. ఓబుళాపురం కేసుకు ముందు యడ్యూరప్ప కేబినెట్ లో కీలక శాఖల మంత్రిగా వ్యవహరించిన గాలి… కేసు తర్వాత చడీచప్పుడు లేకుండానే సాగుతున్నారు. అయితే ఇప్పుడు జై శ్రీరామ్ వ్యాఖ్యలపై స్పందించి ఆయన మరోమారు వార్తల్లో వ్యక్తిగా నిలిచారని చెప్పాలి.
బీజేపీలో సుదీర్ఘ కాలం పాటు కొనసాగి ఇటీవలే ఆ పార్టీని వీడిన సీనియర్ రాజకీయవేత్త బసనగౌడ పాటిల్ యత్నాల్ ఇటీవలే జై శ్రీరామ్ వ్యాఖ్యలు చేసి సంచలనం రేపారు. పాఠశాలల్లో విద్యార్థులు హాజరు పలికే సమయంలో ‘ఎస్ సర్’ కు బదులుగా ‘జై శ్రీరామ్’ అని పలకాలని ఆయన సూచించారు.
ఈ వ్యాఖ్యలు ఇప్పుడు కన్నడనాట వైరల్ గా మారాయి. బసనగౌడ వ్యాఖ్యలకు సంబందించిన వీడియోలో సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇలాంటి సమయంలో బసనగౌడ వ్యాఖ్యలను సమర్థిస్తూ గాలి జనార్థన్ వ్యాఖ్యానించడం మరింత సంచలనం రేపింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates