జగన్ మంచోడు కాబట్టే వాళ్లు బ్రతికున్నారు

ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ పై కొంతకాలంగా కూటమి పార్టీల నేతలు ట్రోలింగ్ చేస్తోన్న సంగతి తెలిసిందే. వైసీపీని గొడ్డలి పార్టీ అంటూ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ తదితరులు కామెంట్ చేస్తున్నారు. ఇక, సోషల్ మీడియాలో అయితే వైసీపీ నేతలను యాక్స్ గ్యాంగ్ అంటూ కొందరు ట్రోల్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే జగన్ ఆ కామెంట్లపై స్పందించారు. ఎవరిదయ్యా గొడ్డలి పార్టీ అంటూ జగన్ ప్రశ్నించారు.

‘‘జగన్ మంచోడు కాబట్టే మా తాత రాజారెడ్డిని చంపినోళ్లు ఇంకా ప్రశాంతంగా తిరుగుతున్నారు…జగన్ నైజం ఎలాంటిది అనేదానికి అదే నిదర్శనం…వారంతా ఇంకా బతికే ఉన్నారు…వారికి ఎప్పటికీ ఏమీ కాదు…నేను చెడ్డోడిని అయితే మా తాతను దారునంగా నరికి చంపిన వాళ్లు ఇప్పుడు ప్రశాంతంగా తిరిగేవారా అని ప్రశ్నించారు.

చంద్రబాబులా హత్యా రాజకీయాలు చేయడం నాకు తెలియదు….ప్రజలకు మంచి చేసి మంచిపేరు సంపాదించాలని నాన్న రాజశేఖర్ రెడ్డి నేర్పించారు..’’అంటూ జగన్ చేసిన కామెంట్లు వైరల్ అయ్యాయి.

తన కుటుంబం తన తాత, తండ్రి, చిన్నాన్న..ముగ్గురిని కోల్పోయిందని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. గొడ్డళ్లు, గునపాలు ఎవరికి అవసరమో ప్రజలందరికీ తెలుసని అన్నారు. విలువలు, విశ్వసనీయతతో రాజకీయాలు చేస్తున్నానని చెప్పారు. రెండేళ్లలో ఎంతోమంది వైసీపీ నేతలు, కార్యకర్తలను హత్య చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.