రోడ్డు పక్కన తాటిముంజలు తిన్న సీఎం దంపతులు

ఏపీలో భానుడు భగభగ మండుతున్న వేళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దంపతులు రోడ్డు పక్కన ఆగి తాటి ముంజలు తింటూ గ్రామీణ జీవన శైలిని గుర్తుచేసుకున్నారు. కుప్పం పర్యటనలో భాగంగా ప్రసన్న తిరుపతి గంగమ్మ జాతరకు వెళ్లి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించిన అనంతరం తిరుగు ప్రయాణంలో తంజమ్మకొట్టాలు సమీపంలో కల్లుగీత కార్మికులు తాటి ముంజలు తీస్తుండటాన్ని గమనించిన సీఎం దంపతులు అక్కడే ఆగారు.

ఈ సందర్భంగా తాజాగా తీసిన తాటి ముంజలను రుచి చూసిన సీఎం చంద్రబాబు.. “కల్తీ లేదు.. కార్బైడ్ లేదు.. పురుగుమందుల గోల లేదు.. మా కుప్పం ప్రజల మనసుల్లాంటి స్వచ్ఛమైన, చల్లనైన తాటి ముంజలు తింటుంటే ఎంతో హాయిగా ఉంది. మన గ్రామీణ ఆహార ఉత్పత్తులను మించింది ఏముంటుంది” అంటూ సామాజిక మాధ్యమాల్లో వ్యాఖ్యానించారు.

మరోవైపు నారా భువనేశ్వరి కూడా ఈ అనుభూతిని పంచుకున్నారు. చిన్ననాటి రోజులు గుర్తొచ్చాయని పేర్కొంటూ.. గ్రామీణ ప్రాంతాల్లో లభించే సహజ ఆహార పదార్థాలకు ప్రత్యేకమైన రుచి ఉంటుందని తెలిపారు. ఈ సందర్భంగా కల్లుగీత కార్మికులతో మాట్లాడిన సీఎం చంద్రబాబు వారి వృత్తి సమస్యలు, కుటుంబ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. గ్రామీణ వృత్తులు, సంప్రదాయ ఆహారాలకు ప్రోత్సాహం అవసరమని అభిప్రాయపడ్డారు.