మ‌ళ్లీ `ఇన్‌ఫ్లేష‌న్` భూతం… జేబుల‌కు చిల్లే!

దేశంలో గ‌త ఆరు మాసాలుగా ఒకింత అదుపులో ఉన్న ద్రవ్యోల్బ‌ణం(ఇన్‌ఫ్లేష‌న్‌) ప్ర‌స్తుతం పెరుగుతోందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఆర్బీఐ కూడా ఇదే మాట చెబుతోంది. దీంతో త్వ‌ర‌లోనే అన్ని ర‌కాల వ‌స్తువుల ధ‌ర‌ల‌తోపాటు.. గృహ‌రుణాల‌పై వ‌డ్డీలు, ప‌ర్స‌న‌ల్ లోన్ల‌పైనా.. వాహ‌న రుణాల‌పైనా వ‌డ్డీలు మ‌రింత పెరగ‌నున్నాయ‌న్న సంకేతాలు వ‌స్తున్నాయి.

ఏంటీ ద్ర‌వ్యోల్బ‌ణం?

ద్రవ్యోల్బణం…. ఒక నిర్దిష్ట కాలంలో వస్తువులు, సేవల ధరలు నిరంతరంగా పెరిగి, ప్ర‌జ‌ల‌ కొనుగోలు శక్తి తగ్గిపోవడమే ద్ర‌వ్యోల్బ‌ణం. దీనివల్ల మార్కెట్‌లో నిత్యావసర సరుకులు, ఇంధన ధరలు, జీవన వ్యయం భారమవుతాయి. ప్రస్తుత దేశ ద్రవ్యోల్బణ పరిస్థితులు, దీని ప్రభావాలు ప్ర‌జ‌ల‌పై తీవ్ర స్థాయిలో ప్ర‌భావం చూప‌నున్నాయ‌ని తెలుస్తోంది. ముఖ్యంగా వినియోగదారుల ధరల సూచిక (CPI) ఆధారంగా ద్రవ్యోల్బణం 3.5% వరకు నమోదవుతోంది,

అందులోనూ ఆహార పదార్థాల ద్రవ్యోల్బణం దాదాపు 4.2% కంటే ఎక్కువగా ఉంది. కూరగాయలు, పప్పుధాన్యాలు, ఇతర ఆహార పదార్థాల ధరలు మ‌రింత పెర‌గ‌నున్నాయి. ఇక‌, అంతర్జాతీయంగా ముడిచమురు ధరల పెరుగుదల కార‌ణంగా రూపాయి మారకం విలువ బలహీనపడింది. దీంతో ఇంధ‌న ధ‌ర‌లు ఆకాశాన్ని చేరుకున్నాయి. ఫ‌లితంగా రవాణా, పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్నాయి.

ఇక‌, కీల‌క‌మైన ప్ర‌పంచ‌ పరిణామాలు, యుద్ధ నేప‌థ్యంతో అంత‌ర్జాతీయ‌ సరుకుల రవాణా ఖర్చులు పెరిగిపోయాయి. ఇది ధరల పెరుగుదలకు దారితీసింది. సాధారణ జీవితంపై ప్రభావం ఎక్కువ‌గా ఉంటోంది. ప్ర‌జ‌ల కొనుగోలు శక్తి పతనమ‌య్యే అవ‌కాశం ఉంటుంది. సామాన్యుల నెలవారీ బడ్జెట్ పై తీవ్ర ప్రభావం పడుతుంది. పొదుపు, మదుపులపైనా ప్రభావం చూపుతుంది.

బ్యాంకులలో డబ్బు దాచుకుంటే వచ్చే వడ్డీ కంటే ద్రవ్యోల్బణం వల్ల ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. ఇదే స‌మ‌యంలో బ్యాంకులు వ‌డ్డీల‌ను పెంచుతాయి. దీంతో గృహ రుణాలు, వాహ‌న రుణాలు, విదేశీ విద్యా రుణాల‌పై వ‌డ్డీల‌ను మ‌రింత పెంచే అవ‌కాశం ఉంది.

ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయడానికి ఆర్బీఐ రెపో రేట్లను పెంచుతుంది. దీనివల్ల రుణాలపై వ‌డ్డీ పెరిగి.. మార్కెట్లో డబ్బు చలామణి తగ్గుతుంది. సో మొత్తంగా యుద్ధం తెచ్చిన తంటాల కార‌ణంగా.. సామాన్యుల జేబులకు చిల్లులు ప‌డ‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు నిపుణులు.