కాపుల‌ను త‌ట‌స్థం చేయ‌డ‌మే వైసీపీ ల‌క్ష్య‌మా?

కాపు సామాజిక వ‌ర్గాన్ని త‌ట‌స్థం చేయాల‌న్న దిశ‌గా వైసీపీ అడుగులు వేగంగా ప‌డుతున్నాయా? అంటే.. ఔన‌నే స‌మాధాన‌మే వినిపిస్తోంది. ప్ర‌స్తుతం కాపులు.. ఎవ‌రు ఔన‌న్నా.. కాద‌న్నా.. జ‌న‌సేన‌కు అనుకూలంగా ఉన్నారు. పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ సిద్ధాంతాలు న‌చ్చిన వారు కొంద‌రు.. పార్టీలో ఉండాల‌ని.. త‌మకంటూ ఓ వేదిక ఉంద‌ని అభిప్రాయ‌ప‌డే వారు కొంద‌రు. ఇలా.. మొత్తంగా కాపులు.. జ‌న‌సేన‌కు అనుకూలంగా ఉన్నారు.

అయితే.. ఇలా వారంతా ఐక్యంగా ఉంటే.. వైసీపీకి ఎదురు దెబ్బ మ‌రోసారి త‌ప్ప‌ద‌న్న భావ‌న ఉంది. ఈ క్ర‌మంలోనే అస‌లు కూట‌మిలోనే విభేదాలు క‌ల్పించ‌డం ద్వారా.. కూట‌మి విచ్ఛిన్నం చేసే దిశ‌గా కూడా.. ఇటీవ‌లి వ‌ర‌కు వైసీపీ నాయకులు ఇటు సోష‌ల్ మీడియాలోను.. అటు బ‌హిరంగ వేదిక‌ల‌పై కూడా.. చ‌ర్చకు దారి తీశారు. అయితే.. ఈ వ్య‌వ‌హారంపై పార్టీ అధినేత‌.. ప‌వ‌న్ క‌ల్యాణ్ ఇటీవ‌ల మ‌రోసారి కూట‌మి ప్రాధాన్యాన్ని తేల్చి చెప్పారు. ఎవ‌రు ఉన్నా.. లేకున్నా.. కూట‌మి కొన‌సాగుతుంద‌న్నారు.

దీంతో ఇప్పుడు కాపుల‌ను త‌ట‌స్థం చేసేందుకు.. అంటే.. వారు జ‌న‌సేన‌కు అనుకూలంగా ఉండ‌కుండా చేయాల‌న్న వ్యూహాల‌ను తెర‌మీదికి తెచ్చిన‌ట్టు తెలిసింది. దీనిలో భాగంగా మ‌రోసారి.. కాపు ఉద్య‌మం దిశ‌గా అడుగులు వేసేందుకు కీల‌క నాయ‌కుల‌ను ప్రోత్స‌హిస్తున్న‌ట్టు స‌మాచారం. 2014-19 మ‌ధ్య కాపులు త‌మ‌కు రిజ‌ర్వేష‌న్ స‌హా.. ఇత‌ర డిమాండ్ల‌పై ఉద్య‌మించారు. కానీ, వైసీపీ రావ‌డంతో వారంతా మౌనంగా ఉండిపోయారు.

ఇప్పుడు మ‌రోసారి ఈ ఉద్య‌మం ప్రారంభించేలా క్షేత్ర‌స్థాయిలో అంత‌ర్గ‌త చ‌ర్చ‌ల‌కు వైసీపీ నాయ‌కులు ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ట్టు తెలిసింది. త‌ద్వారా ప్ర‌స్తుత కూట‌మి ప్ర‌భుత్వంపై కాపుల ఉద్య‌మాన్ని ప్రేరేపించే దిశ‌గా అడుగులు వేయాల‌న్న‌ది వైసీపీ వ్యూహంగా ఉంది. నిజానికి కాపులు ప్ర‌స్తుతం ఉద్య‌మాలు మానేశారు. త‌మ‌కు ప‌వ‌న్ ఉన్నాడ‌న్న భ‌రోసా ఉంది. కానీ, ఇదే ఇప్పుడు వైసీపీకి ఇబ్బందిగా మారి.. వారిలో అనైక్య‌త‌ను పెంచి.. త‌ట‌స్థం చేసే దిశ‌గా అడుగులు వేస్తున్న‌ట్టు స‌మాచారం.