అంబటి నోట ‘లవ్ క్యాష్’ మాట

వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు నిరసన బాట పట్టారు. దేశవ్యాప్తంగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలన్న డిమాండ్ తో సోమవారం ఏపీవ్యాప్తంగా వైసీపీ శ్రేణులు నిరసనలకు దిగిన సంగతి తెలిసిందే.

గుంటూరులో చేపట్టిన నిరసన కార్యక్రమంలో పాలుపంచుకున్న అంబటి…టీడీపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఏపీ కేబినెట్ లో కీలక శాఖల మంత్రిగా కొనసాగుతున్న నారా లోకేశ్ పై విరుచుకుపడిపోయారు. ఈ సందర్భంగా ఆయన లోకేశ్ కు ఓ కొత్త పేరు కూడా పెట్టారు. లోకేశ్ కు లవ్ క్యాష్ అనే పేరు అయితే సూటవుతుందని ఆయన సంచలన వ్యాఖ్య చేశారు.

తాము అధికారంలోకి వస్తే… అన్నింటి ధరలను తగ్గిస్తామని లోకేశ్ ఏపీ ప్రజలకు హామీ ఇచ్చారని అంబటి గుర్తు చేశారు. లోకేశ్ మాట నమ్మి జనం టీడీపీకి ఓటేస్తే.. అధికారంలోకి వచ్చిన తర్వాత తానిచ్చిన హామీని విస్మరించిన లోకేశ్… ధరలను పెంచుకుంటూ పోతున్నారని ఆయన ఆరోపించారు.

లోకేశ్ కు కమీషన్ల మీద అలవిమాలిన ప్రేమ ఉందన్న అంబటి…తనకు కమీషన్లు వచ్చే రంగాల రేట్లను పెంచని లోకేశ్… పెట్రోల్ బంకుల యాజమాన్యాలు కమీషన్లు ఇవ్వవు కాబట్టే పెట్రోల్, డీజిల్ రేట్లను పెంచారంటూ తనదైన శైలి ఆరోపణలు గుప్పించారు.

అమెరికా, ఇరాన్ యుద్ధం నేపథ్యంలో పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా ముడి చమురు, గ్యాస్ దిగుమతులకు ఒకింత ఇబ్బంది కలుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పరిస్థితులను తట్టుకునేందుకు ఇంధన పొదుపు చర్యలకు దేశ ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిస్తే… వాటిని టీడీపీ నేతృత్వంలోని కూటమి సర్కారు కూడా అందిపుచ్చుకుంది.

ఇక దినదినానికి పెరుగుతున్న ఇంధన కొరతను తట్టుకునే క్రమంలోనే ఇటీవలే లీటరుకు రూ.3 చొప్పున పెట్రోల్, డీజిల్ ధరలను కేంద్రం పెంచింది. ఈ పెంపుదల ఒక్క ఏపీలోనే జరిగిందన్న భావనతో వైసీపీ ఆంధోళనలకు తెర తీసిందంటూ టీడీపీ నుంచి కూడా సెటైర్లు పడిపోతున్నాయి.