ఏపీలో జనాభా పెరుగుదలకు కూటమి సర్కారు సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కూటమి రథసారధి టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు శనివారం సంచలన ప్రకటన చేశారు. శ్రీకాకుళంలో శనివారం నిర్వహించిన స్వర్ణాంద్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ప్రసంగించిన చంద్రబాబు… రాష్ట్రంలో క్రమంగా జనాభా తగ్గుతోందని, ఇది ఆందోళన కలిగించే విషయమని చెప్పారు. ఈ ఆందోళనను తగ్గించేలా జనాభా పెరుగుదలకు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నామన్నారు. అధిక సంఖ్యలో పిల్లలను కనే కుటుంబాలకు ప్రభుత్వం నుంచి తక్షణ ఆర్థిక సాయాన్ని అందిస్తామని ఆయన ప్రకటించారు.
ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత మూడో బిడ్డకు జన్మనిచ్చే కుటుంబానికి బిడ్డ పుట్టిన వెంటనే రూ.30 వేలను అందజేస్తామని చంద్రబాబు తెలిపారు. అదే సమయంలో నాలుగో బిడ్డ పుడితే రూ.40 వేలు అందజేస్తామని ఆయన తెలిపారు. పిల్లలు కుటుంబాలకు భారం కాదని… పిల్లలే ఆయా కుటుంబాలకు సంపద అనే విషయాన్ని చేసి చూపిస్తామని ఆయన వెల్లడించారు. ప్రస్తుతం తల్లికి వందనం కింద ఒక్కో బిడ్డకు రూ.15 వేలు ఇస్తున్నామని గుర్తు చేసిన చంద్రబాబు… దేవుడి దయ బాగుంటే తల్లికి వందనం కింద ఇచ్చే మొత్తాన్ని పెంచుతామని తెలిపారు.
రాష్ట్రంలో జనాభా తరుగుదల గురించి చాలా కాలం నుంచే చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. జనాభా తరుగుదల వల్ల సమాజం సమతుల్యత కోల్పోతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే విభజిత ఏపీకి రెండో సారి సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన వెంటనే రాష్ట్ర జనాభాను పెంచే దిశగా ఆయన చర్యలను ప్రారంభించారు.
ఇందుకోసం ప్రభుత్వం నుంచి ప్రోత్సాహాలు అందించే దిశగా ఆయన కార్యాచరణ ప్రారంభించారు. అందులో భాగంగా ఇద్దరు పిల్లలను దాటుకుని మూడు, నాలుగు మంది బిడ్డలను కనే కుటుంబాలకు తొలిసారి ఆర్థిక ప్రోత్సాహాలను ప్రకటిస్తూ చంద్రబాబు శనివారం కీలక ప్రకటన చేశారు. ఈ ప్రకటనతో రాష్ట్రంలో జనాభా పెరుగుదల దిశగా చర్యలు మొదలైనట్టేనన్న వాదనలు వినిపిస్తున్నాయి.
Gulte Telugu Telugu Political and Movie News Updates
