ఏపీ సీఎం చంద్రబాబుకు కేంద్రం చేసిన ప్రతిపాదన తీవ్ర సంకట స్థితిలోకి నెట్టేసింది. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలంటూ.. కేంద్ర ప్రభుత్వం చంద్రబాబుకు తేల్చి చెప్పింది. ఇదే జరిగితే.. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నీటి వివాదాలు ఉండే అవకాశం లేదని కూడా స్పష్టం చేసింది. అయితే.. పాలమూరు -రంగారెడ్డి ప్రాజెక్టుకు ఏపీ ఆది నుంచి విభేదిస్తున్న విషయం తెలిసిందే.
ఈ ప్రాజెక్టు కారణంగా.. 70 టీఎంసీల కృష్ణానది నీటిని.. పాలమూరు, మహబూబాబాద్ సహా.. మరిన్ని జిల్లాలకు ఎత్తి పోస్తారు. తద్వారా.. శ్రీశైలానికి వచ్చే కృష్ణానీటిలో కోత పడుతుంది. ఇది.. విద్యుత్ ఉత్పత్తి పైనే కాకుండా.. ఏపీలో రాయలసీమ ప్రాంతాలకు నీటి ఎద్దడి మరింత పెరుగుతుంది. అంతేకాదు.. కృష్ణా వరద జలాలు.. కూడా ఏపీలోకి వచ్చే అవకాశం లేదు. కానీ, ఈ ప్రాజెక్టుతో తెలంగాణలో నాలుగు కీలక జిల్లాలు సస్యశ్యామలం అవుతాయి.
ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి సొంత ప్రాంతం పాలమూరుకు ఈ ప్రాజెక్టు వర ప్రదాయనిగా మారనుంది. అందుకే.. సీఎం రేవంత్ సైతం.. పాలమూరు-రంగారెడ్డిపై తరచుగా ప్రకటనలు చేస్తున్నారు. గత కేసీఆర్ ప్రభుత్వందీనిని కట్టలేక పోయిందని.. తాము నిర్మించి తీరుతామని కూడా చెబుతున్నారు. అయితే.. ఏపీ ప్రభుత్వం.. పాలమూరు ప్రాజెక్టును అడ్డుకోవాలని.. ఇప్పటికే కేంద్రానికి లేఖలు రాయడంతోపాటు.. కేసులు కూడా దాఖలు చేసింది.
ఈ పరిణామాల క్రమంలో చంద్రబాబు వద్ద కేంద్రం పాలమూరుకు ఒప్పుకోవాలని.. తద్వారా రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న నీటి వివాదాలను పరిష్కరించుకునేందుకు అవకాశం ఏర్పడిందని చెబుతోంది.
మరోవైపు.. తెలంగాణలో టీడీపీని విస్తరించాలన్న ప్రతిపాదనలు ఉన్న దరిమిలా.. ఈ ప్రాజెక్టుకు అంగీకరిస్తే మేలు జరుగుతుందని ఇక్కడి దేశం నాయకులు చెబుతున్నారు. కానీ, అదేసమయంలో సీమ ప్రాంతంలో పార్టీకి నష్టం జరుగుతుందని అంటున్నారు. మరి ఈ వ్యవహారంలో చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates