దేశంలో ఇటీవలే ముగిసిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎప్పుడో వెలువడ్డాయి. ఆ ఐదు రాష్ట్రాల్లో నాలుగు రాష్ట్రాల్లో ఏకంగా ప్రభుత్వాలు కూడా ఏర్పడిపోయాయి. ఫలితాలు వెలువడి… కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ కు సంపూర్ణ మెజారిటీ వచ్చినప్పటికీ అక్కడ ఇంకా ప్రభుత్వం ఏర్పాటు కాలేదు.
రికార్డు మెజారిటీతో యూడీఎఫ్ విక్టరీ కొట్టినా…కాంగ్రెస్ పార్టీ ఆ రాష్ట్ర సీఎం ఎవరన్న విషయాన్ని ఇప్పటిదాకా తేల్చలేదు. దీంతో కేరళం రాజకీయం ఎన్నికల తర్వాత ఆసక్తి రేకెత్తిస్తోంది. కాంగ్రెస్ పార్టీలో అమలు అవుతూ వస్తున్న సీల్డ్ కవర్ ఎప్పుడు రిలీజ్ అవుతుందో, అది కేరళం చేరి ఎప్పుడు ఓపెన్ అవుతుందో..ప్రభుత్వం ఎప్పుడు ఏర్పడుతుందోనన్న విషయాలపై ఆసక్తికర చర్చలు నడుస్తున్నాయి.
గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్ లో ఇంకా సీల్డ్ కవర్ రాజకీయాలు కొనసాగుతున్నాయంటూ విపక్షాలు ఆరోపిస్తూనే ఉన్నాయి. అయినా కూడా ఆ పార్టీ ఈ తరహా సంస్కృతికి వీడ్కోలు పలకడం లేదు. పార్టీ అధిష్ఠానం తీసుకునే నిర్ణయాలను ఆయా రాష్ట్రాలకు సీల్డ్ కవర్ లో పంపుతున్నారు.
ఈ కవర్ ను ఓపెన్ చేసే పీసీసీ చీఫ్ లు వాటిలోని నిర్ణయాలను వెల్లడి చేస్తున్నారు. తాజాగా కేరళం సీఎం ఎవరన్న విషయాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ సీల్డ్ కవర్ ద్వారానే వెల్లడించనుంది. ఎన్నికల ఫలితాలు వెలువడి ఇప్పటికే పది రోజులు కావస్తున్నా… ఇంకా కేరళం సీఎం ఎవరన్న విషయాన్ని కాంగ్రెస్ తే్ల్చకపోవడం గమనార్హం.
కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ అనారోగ్య కారణాల వల్ల గత కొంతకాలంగా యాక్టివ్ గా లేరు. అయితే పార్టీ వ్యవహారాలను చెక్కబెట్టేందుకు పార్టీ అధ్యక్షుడిగా సీనియర్ నేత మల్లికార్జున ఖర్గేను నియమించిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా లోక్ సభలో ప్రధాన ప్రతిపక్ష నేతగా కొనసాగుతున్న రాహుల్ గాంధీ కూడా కీలక నిర్ణయాలు తీసుకోవడంలో యాక్టివ్ గానే ఉంటున్నారు.
అయినా కూడా కేరళం సీఎం ఎవరన్న విషయాన్ని తేల్చడంలో మాత్రం పార్టీ అధిష్ఠానానికి ఇప్పటిదాకా వీలు కాలేదు. అయితే మంగళవారం సోనియా గాంధీ ఈ వ్యవహారంపై దృష్టి సారించారని, త్వరలోనే కేరళం సీఎం ఎవరన్న విషయం తేలిపోనుందని సమాచారం.
కేరళం సీఎం ఎవరన్న విషయాన్ని తేల్చే పనిలో కాంగ్రెస్ అధిష్ఠానం తలమునకలై ఉండగా… ఆ పదవిని ఆశిస్తున్న వారిలో ప్రధానంగా ముగ్గురి పేర్లు వినిపిస్తున్నాయి. పార్టీలో ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతూ రాహుల్, ప్రియాంకా గాంధీలకు అత్యంత సన్నిహితుడిగా మెలగుతున్న ఎంపీ కేసీ వేణుగోపాల్ పేరు తొలి వరుసలో ఉంది.
ఇక పార్టీ కేరళం శాఖలో అత్యంత సీనియర్ గానే కాకుండా పార్టీ ఎప్పుడు ప్రమాదంలో పడినా… నేనున్నానంటూ పార్టీని దారిలో పెడుతూ వస్తున్న రమేశ్ చెన్నితాల పేరు కూడా ప్రముఖంగానే వినిపిస్తోంది.
చివరగా…మొన్నటిదాకా కేరళం అసెంబ్లీలో ప్రదాన ప్రతిపక్ష నేతగా ఉండి… పార్టీని ప్రతిపక్షం నుంచి అధికార పక్షం వైపుగా తీసుకువచ్చారని ప్రశంసలందుకుంటున్న వీడీ సతీశన్ పేరు కూడా గట్టిగానే వినిపిస్తోంది. మరి ఈ ముగ్గురిలో కేరళం సీఎం సీటు ఎవరిని వరిస్తుందో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates