ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్న మోదీ వ్యాఖ్యలు

యావత్తు ప్రపంచాన్ని కరోనా చుట్టుముట్టిన తరుణంలో లాక్ డౌన్ అంటే ఏమిటో… ఎలా ఉంటుందో చూశాం. ఇప్పుడు కరోనా లాంటి మహమ్మారి లేకున్నా కూడా భారత దేశంలో లాక్ డౌన్ తరహా ఆంక్షలు అమలులోకి వస్తాయా? అన్న దిశగా ఆసక్తికర విశ్లేషణలు సాగుతున్నాయి. పూర్తి స్థాయి లాక్ డౌన్ కాకున్నా…పాక్షిక లాక్ డౌన్ అయినా తప్పదా? అన్న భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ భయాందోళనలకు వేరెవరో కారణం కాదు. సాక్షాత్తు మన దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీనే కారణమన్న మాట అందరి నోటా వినిపిస్తోంది.

మొన్నటికి మొన్న హైదరాబాద్ వచ్చిన మోదీ… సికింద్రాబాద్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో డీజిల్, పెట్రోల్ వినియోగం తగ్గించండి అంటూ… ఆ దిశగా పలు కీలక సూచనలు జారీ చేశారు. అంతేకాకుండా వర్క్ ఫ్రం హోంను మరోమారు అమలులోకి తీసుకురావాలంటూ ఆయన ఒకింత సంచలన వ్యాఖ్యలే చేశారు.

ఇక తాజాగా విద్యాలయాలు కూడా ఆన్ లైన్ తరహా విద్యా బోధనను అమలు చేస్తే బాగుంటుందంటూ మోదీ మరో సంచలన వ్యాఖ్య చేశారు. వరుసబెట్టి లాక్ డౌన్ తరహా ఆంక్షలను ప్రస్తావిస్తున్న మోదీ… త్వరలోనే దేశంలో పాక్షిక లాక్ డౌన్ ను అమలు చేయనున్నామన్న రీతిలో పరోక్ష సంకేతాలు ఇచ్చారు.

అయినా మోదీ నోట ఈ తరహా వ్యాఖ్యలు రావడానికి కారణమేమిటన్న విషయానికి వస్తే… అమెరికా, ఇరాన్ దేశాల మద్య కొనసాగుతున్న యుద్ధం, ఆ యుద్ధం కారణంగా విశ్వవ్యాప్తంగా పలు దేశాల్లో ప్రత్యేకించి భారత్ లాంటి దేశాల్లో ఇంధనానికి ఏర్పడ్డ తీవ్ర కొరత కారణమని చెప్పాలి.

చమురు ఉత్పత్తి చేస్తున్న దేశాలు యుద్ధంలో పాలుపంచుకుంటూ ఉంటే… ఆయా దేశాల నుంచి ఇంధనం తీసుకుంటున్న దేశాలకు నిజంగానే ఇంధనం దొరకని పరిస్థితి. అలాగని యుద్ధంలో తలమునకలైన ఆయా దేశాలతో మాట్లాడి.. వాటి నుంచి నిలిచిపోయిన చమురు రవాణాను పునరుద్ధరించే పరిస్థితి కూడా లేదాయే. ఈ పరిస్థితులను అదిగమించేందుకే మోదీ పాక్షిక లాక్ డౌన్ తరహా ఆంక్షలను వరుసబెట్టి ప్రస్తావిస్తున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి.

దేశంలో ఇప్పటికే ఇంధన రేట్లు ఆకాశాన్నంటుతున్నాయి. యుద్ధం నేపథ్యంలో చమురు కొరతను చూపి ఇంధన ధరలను మరింతగా పెంచే అవకాశం అయితే లేదు. అలా చేస్తే… ప్రజాగ్రహం తప్పదన్న మాట మోదీకి ఎరుకే. మరేం చేయాలి? లాక్ డౌన్ తరహా ఆంక్షలను అమలులోకి తీసుకురావాలి.

ఫలితంగా ఇంధన వినియోగాన్ని తగ్గించాలి. వాస్తవ పరిస్థితి ఎలా ఉందన్న విషయాన్ని పక్కనపెడితే…ఇంధనానికి మరింత కొరత ఏర్పడితే… జనం తట్టుకునేలా మోదీ ముందుగానే జనాన్ని సమాయత్త పరుస్తున్నారన్న వాదన అయితే గట్టిగానే వినిపిస్తోంది.