కేంద్ర మంత్రి బండి సంజయ్ తనయుడు బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదైన సంగతి తెలిసిందే. అయితే, కేసు నమోదై 3 రోజులు గడుస్తున్నా భగీరథ్ ను అరెస్ట్ చేయలేదని, ప్రధాని మోదీ టూర్ తర్వాత ఈ కేసు వ్యవహారం బయటకు వచ్చేలా సీఎం రేవంత్ రెడ్డి, బండి సంజయ్ ల మధ్య చీకటి ఒప్పందం కుదిరిందని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు.
భగీరథ్ పై పోక్సో కేసు నమోదైనా చర్యలు లేవని, చట్టం నుంచి అతడికి ఏమైనా మినహాయింపు ఉందా అని కేటీఆర్ ప్రశ్నించారు. ఇదేనా బీజేపీ చెబుతున్న బేటీ బచావో మోదీ గారు అంటూ ప్రధానిని ప్రశ్నించారు. బండి సంజయ్ ఎప్పుడు రాజీనామా చేస్తారు అని నిలదీశారు. తెలంగాణలో కాంగ్రెస్ జంగిల్ రాజ్ నడుస్తోందని, పోక్సో కేసులో నేరస్తుల మాదిరిగా భగీరథ్ ను ఎందుకు ట్రీట్ చేయడం లేదంటూ రాహుల్ గాంధీని ప్రశ్నించారు.
పోలీసులు భగీరథ్ పై కేసు నమోదు చేయడం లేదని, తనకు న్యాయం జరగడం లేదని బాధితురాలు రెండుసార్లు సూసైడ్ అటెంప్ట్ చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీకి టీ కాంగ్రెస్ ఒక ఫ్రాంచైజీలా పని చేస్తోందని, రేవంత్ పాలనలో ఆడబిడ్డలకు రక్షణ లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇక, బండి సంజయ్ ను కాపాడేందుకు, ఈ కేసును నీరుగార్చేందుకు రేవంత్ రెడ్డి సిట్ వేశారని హరీశ్ రావు ఆరోపించారు. ఇప్పటి దాకా రేవంత్ 10 సిట్ లు వేశారని, ఏ ఒక్క సిట్ నివేదక ఇంతవరకు బయటకు రాలేదని విమర్శించారు. అయినా, పోక్సో కేసు పెట్టిన తర్వాత సిట్ ఎందుకని ప్రశ్నించారు.
కేవలం రిట్వీట్ చేసినందుకే బీఆర్ఎస్ కార్యకర్తలను అర్ధరాత్రి అరెస్ట్ చేసిన రేవంత్ సర్కార్..బండి భగీరథ్ విషయంలో ఎందుకు మౌనంగా ఉందని ప్రశ్నించారు. కేసు పెట్టి 4 రోజులైనా భగీరథ్ ను ఎందుకు అరెస్ట్ చేయలేదని నిలదీశారు. కాంగ్రెస్ – బీజేపీ కుమ్మక్కు రాజకీయాలకు ఇది నిదర్శనమని అన్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates