మోదీ బంగారాన్ని ఎందుకు కొనొద్దంటున్నారు?

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆదివారం నాటి హైదరాబాద్ పర్యటన సాంతం ఆసక్తికరంగానే సాగింది. తెలంగాణ పర్యటనకు వచ్చిన మోదీ… హైదరాబాద్ లో ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఇంటికి వెళ్లి ఆతిథ్యాన్ని స్వీకరించారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇంటికి వెళ్లి ఆయనను పరామర్శించారు. ఇక బీజేపీ తెలంగాణ శాఖ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించిన మోదీ… బంగారం కొనొద్దంటూ దేశ ప్రజలకు పిలుపునిచ్చి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. మోదీ నోట నుంచి బంగారం కొనొద్దన్న మాట విన్నంతనే… ఆ వ్యాఖ్యలు తెగ వైరల్ అయిపోయాయి.

ఎందుకంటే… దేశ ప్రజలు ఏం చేస్తే బాగుంటుందో చెప్పే బాధ్యత ప్రధానిగా మోదీకి ఉన్నా.. మరీ బంగారం కొనొద్దంటూ జనానికి చెప్పడం ఒకింత వింతగానే ఉందన్న మాట అయితే బలంగానే వినిపిస్తోంది. అయినా పొదుపులో అన్నింటికంటే మెరుగైన మార్గం బంగారం కొనుగోలు. మరి అలాంటి బంగారాన్ని కొనొద్దంటూ మోదీ ఎందుకు చెప్పారు? దానికీ ఓ రీజనుంది. ఆ రీజనేమిటో మోదీనే వెల్లడించారు.

బంగారం రేట్లు ఇటీవలి కాలంలో ఓ రేంజిలో మారిపోతున్నాయి. గతంలో ఎన్నడూ లేనంత స్థాయిలో బంగారం రేట్లు పెరిగాయి. అదే సమయంలో బంగారం ధరల్లో స్వల్పకాలంలోనే పెద్ద హెచ్చుతగ్గులు కూడా నమోదు అవుతున్నాయి. ఇలాంటి సమయంలోనే అమెరికా, ఇరాన్ యుద్ధం ప్రపంచ దేశాలను దిగ్భ్రాంతికి గురి చేసింది.

ఈ యుద్ధం కారణంగా ఆయా దేశాల ఆర్థిక వ్యవస్థలు కూడా ఓ రేంజిలో ప్రభావితం అవుతున్నాయి. ఇక ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మందగమనం అయితే విస్పష్టంగానే కనిపిస్తోంది. రానున్న ఏడాది పాటు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మరింతగా మందగించే ప్రమాదం లేకపోలేదన్న వాదనలు బలంగానే వినిపిస్తున్నాయి.

ఇదే విషయాన్ని ప్రస్తావించిన మోదీ…బంగారం కొనొద్దంటూ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. బంగారం కొనుగోలును కనీసం ఓ ఏడాది పాటు అయినా వాయిదా వేయాలని ఆయన కోరారు. లేదంటే యుద్ధం కారణంగా తీవ్రంగా ప్రభావితం అవుతున్న బంగారం ధరల కారణంగా ఆ విలువైన లోహాన్ని కొనే వారు భారీగా నష్టపోయే ప్రమాదం ఉందని మోదీ అభిప్రాయపడ్డారు.

అంటే… ప్రపంచ ఆర్థిక మందగమనం, యుద్ధం నేపథ్యంలో బంగారం ధరలు విపరీతంగా ప్రభావితం కానున్నాయని చెప్పిన మోదీ… ఆ ప్రభావం నుంచి తప్పించుకోవాలంటే కనీస ఓ ఏడాది పాటు అయినా బంగారం కొనుగోలును వాయిదా వేయాలని సూచించారు.

ఇక పనిలో పనిగా ఇంధన వినియోగంపైనా దేశ ప్రజలకు మోదీ పలు కీలక సూచనలు చేశారు. వర్క్ ఫ్రం హోంను వీలయినంత మేర ప్రోత్సహించాలని ఆయన పిలుపునిచ్చారు. వర్క్ ఫ్రం హోంతో ఉద్యోగుల ప్రయాణాలు తగ్గి… ఇంధనం ఆదా అవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.

అంతేకాకుండా పెట్రోల్, డీజిల్ వంటి ఇంధనాల వినియోగాన్ని వీలయినంత మేర తగ్గించాలని సూచించిన మోదీ… ఈ ఇంధనాలకు ప్రత్యామ్నాయ మార్గాలను అనుసరించాలని పిలుపునిచ్చారు. ఫలితంగా అంతకంతకూ పెరుగుతున్న ఇంధన ఖర్చులను తప్పించుకోవచ్చని… దేశం కూడా ఇంధనంపై మరింతగా ఖర్చు పెట్టకుండా ఉంటుందని, ఫలితంగా దేశ ఆర్థిక వ్యవస్థ కష్టాల్లో పడకుండా ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.