తెలంగాణ‌పై మోడీ: అప్పుడొక మాట‌.. ఇప్పుడొక మాట‌.. ?

తెలంగాణ‌పై ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ చేసిన వ్యాఖ్య‌లు ప‌ర‌స్ప‌ర విరుద్ధంగా ఉన్నాయ‌న్న వాద‌న వినిపిస్తోంది. గ‌తంలో ఆయ‌న పార్ల‌మెంటులో మాట్లాడిన‌ప్పుడు.. త‌ల్లిని చంపి బిడ్డ‌ను తీశార‌ని తెలంగాణ విభ‌జ‌నపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆ త‌ర్వాత కూడాప‌లు సంద‌ర్భాల్లో పార్ల‌మెంటు త‌లుపులు మూసేసి.. విరుద్ధ‌మైన వ్య‌వ‌స్థ‌ను ఏర్పాటు చేసి రాష్ట్రాన్ని విభ‌జించార‌ని అన్నారు. ఇటీవల బీజేపీ ఎంపీ తేజ‌స్వి సూర్య(క‌ర్ణాట‌క‌) కూడా.. పాకిస్థాన్‌-భార‌త్ విభ‌జ‌న‌తో ఏపీ విభ‌జ‌న‌ను, తెలంగాణ ఏర్పాటును పోల్చారు. అయితే.. తాజాగా తెలంగాణ‌లో ప‌ర్య‌టించిన ప్ర‌ధాని దీనికి భిన్న‌మైన వాద‌న వినిపించారు. ఐతే తమ నాయకులు కేవలం విభజన జరిగిన వివాదం గురించి మాత్రమే అలా మాట్లాడారని, తెలంగాణాకు తాము వ్యతిరేకులం కాదని బీజేపీ నాయకులు చెబుతున్నారు.

తెలంగాణ ఏర్ప‌డ‌క‌ముందు.. ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో రైల్వే ప్రాజెక్టుల‌కు కేవ‌లం వెయ్యి కోట్ల రూపాయ‌ల లోపే నిధులు కేటా యించేవార‌ని ప్ర‌ధాని గుర్తు చేశారు. కానీ, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి ఒక్క‌దానికే 5500 కోట్ల‌రూపాయ‌ల‌ను కేటాయించామ‌న్నారు. త‌ద్వారా రాష్ట్రంలో భారీ ఎత్తున రైల్వే ప్రాజెక్టులు చేప‌ట్టేందుకు అవ‌కాశం ఏర్ప‌డింద‌న్నారు.

త్వ‌ర‌లోనే బుల్లెట్ ట్రైను ప‌నులు కూడా ప్రారంభం అవుతాయ‌ని చెప్పారు. అంటే.. విభ‌జ‌న త‌ర్వాత‌.. తెలంగాణ‌కు ఎంతో మేలు జ‌రిగింద‌న్న అర్ష‌థం ఆయ‌న వ్యాఖ్య‌ల్లో స్పురించింది. కానీ, పార్ల‌మెంటులో మాత్రం.. దీనికి భిన్నంగా వ్య‌వ‌హ‌రించ‌డం గ‌మ‌నార్హం. ఇదే విష‌యం రాజ‌కీయం కూడా చ‌ర్చ‌కు వ‌చ్చింది.

“సైబరాబాద్‌కు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో బలం ఉంది. ఇది తెలంగాణ స‌హా దేశం వేగవంతమైన అభివృద్ధికి ఒక ప్రధాన కేంద్రం. తెలంగాణను దేశంలోనే ఒక ప్రధాన ఉత్పాదక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు, సైబరాబాద్ నుండి అనేక ప్రధాన ప్రాజెక్టులను ప్రారంభిస్తున్నాం. ఈ రోజు శంకుస్థాపన లేదా ప్రారంభోత్సవం జరిగిన ప్రాజెక్టులు ఇక్కడ వేలాది కొత్త ఉద్యోగాలను కల్పిస్తాయి. తెలంగాణ కనెక్టివిటీ కూడా బలోపేతమైంది. ఈ ప్రాజెక్టులకు తెలంగాణ ప్రజలకు నేను అభినందనలు తెలియజేస్తున్నాను.“ అని ప్ర‌ధాని వ్యాఖ్యానించారు.