పెద్దాయన కాళ్ళు మొక్కిన మోదీ… ఆయన ఎవరో తెలుసా?

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా సువేందు అధికారి ప్రమాణస్వీకార కార్యక్రమంలో ఆసక్తికర దృశ్యం కనిపించింది. సభా వేదికపై ఉన్న 98 ఏళ్ల వృద్ధ నాయకుడు మఖన్‌లాల్ సర్కార్ వద్దకు స్వయంగా వెళ్లిన ప్రధాని నరేంద్ర మోదీ.. ఆయనకు శాలువా కప్పి పాదాలకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ దృశ్యం సభలో ఉన్న వారినే కాకుండా సోషల్ మీడియాలో చూసిన వారినీ ఆకట్టుకుంది. దీంతో మఖన్‌లాల్ సర్కార్ ఎవరు? ఆయన ప్రత్యేకత ఏమిటి? అనే ఆసక్తి.మొదలైంది.

మఖన్‌లాల్ సర్కార్ స్వాతంత్ర్య సమరయోధుడిగా, జనసంఘ్‌–బీజేపీ సిద్ధాంతాలకు జీవితాంతం అంకితమైన నాయకుడిగా గుర్తింపు పొందారు. 1952లో డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ నేతృత్వంలో జరిగిన కశ్మీర్ తిరంగా ఉద్యమంలో పాల్గొని అరెస్టయ్యారు. ఆ కాలంలోనే జాతీయవాద భావజాలంతో రాజకీయాల్లోకి వచ్చిన ఆయన.. ఉత్తర బెంగాల్‌లో బీజేపీ బలోపేతానికి కీలకంగా పనిచేశారు.

1981 నుంచి వరుసగా ఏడేళ్ల పాటు జిల్లా అధ్యక్షుడిగా సేవలందించారు. పార్టీకి పెద్దగా బలం లేని రోజుల్లో గ్రామాగ్రామాన తిరిగి కార్యకర్తలను తయారుచేశారు. కేవలం ఒక్క ఏడాదిలోనే 10 వేల మందిని పార్టీలో చేర్పించి విశేష గుర్తింపు పొందారు.

పార్టీ కోసం జీవితాంతం కష్టపడిన అట్టడుగు స్థాయి కార్యకర్తలను బీజేపీ ఎప్పటికీ మరచిపోదనే సందేశాన్నే ప్రధాని మోదీ తన చర్యతో ఇచ్చారని పార్టీ నాయకులు పేర్కొంటున్నారు. సాధారణ కార్యకర్త నుంచి జాతీయ స్థాయిలో గౌరవం పొందిన మఖన్‌లాల్ సర్కార్ జీవితం యువతకు స్ఫూర్తిదాయకమని బీజేపీ నేతలు అభిప్రాయపడుతున్నారు.