ఫ‌స్ట్ టైమ్ ఎంపీ: తండ్రికి త‌గ్గ వార‌సుడు.. !

పువ్వు పుట్టగానే పరిమళించినట్టుగా రాజకీయాల్లోకి వచ్చిన కొంతమంది యువ నాయకులు తమ తండ్రుల వారసత్వాన్ని నిలబెట్టే దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు. తమ భవిష్యత్తు, తమ రాజకీయాలు, త‌మ తండ్రుల వారసత్వం పైనే ఆధారపడి ఉంటాయని భావిస్తున్న కొంతమంది యువ నాయకులు ఆ దిశగానే అడుగులు వేస్తున్నారు. తండ్రుల వారసత్వాన్ని నిలబెట్టే వైపే రాజకీయాలు చేస్తున్నారు. ఇలాంటి వారిలో అమలాపురం పార్లమెంటు సభ్యులు గంటి హరీష్ మాధుర్ ముందు వరుసలో నిలుస్తున్నారని చెప్పాలి.

2024 పార్లమెంటు ఎన్నికల సమయంలో అమలాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆయన 3,42,000 ఓట్ల మెజారిటీతో ఘన విజయం సొంతం చేసుకుని ఫ‌స్ట్ టైం పార్ల‌మెంటులోకి అడుగు పెట్టారు. నిజానికి 2019 ఎన్నికల్లోనే ఆయన తొలిసారి అమ‌లాపురం నుంచి లోక్‌స‌భ‌కు పోటీ చేశారు, కానీ అప్పట్లో వైసిపి హవాతో పాటు జగన్ ప్రభావం కూడా బలంగా కనిపించడంతో పరాజయం పాలయ్యారు.

ఆ తర్వాత కొన్నాళ్ళు నియోజకవర్గానికి దూరంగా ఉన్నారు. ఈ క్రమంలోనే ఆయన ఒక ప్రముఖ ప్రొఫెసర్ దగ్గర రాజకీయ పాఠాలు నేర్చుకున్నారని టిడిపిలో ఒక చర్చ అయితే నడిచింది. తప్పేమీ కాదు. రాజకీయాల్లో ఉన్నంత మాత్రాన నేర్చుకోవడానికి విరుద్ధంగా ఉండాల్సిన అవసరం లేదు.

అనేక కొత్త విషయాలు, మారుతున్న ట్రెండు వంటి వాటిపై ఖచ్చితంగా నేటి యువనేతకు అనుభవం ఉండాలి. నేర్చుకోవాలన్న అభిలాషం ఉండాలి. నేర్చుకోవాలి కూడా. ఇలా తర్ఫీదు పొందిన గంటి హరీష్ మాధుర్ గత ఎన్నికల్లో ఘనవిజయం సాధించారు.

ఆ తర్వాత ఆయన తండ్రికి తగ్గ వారసుడిగా ప్రజలకు చేరువ అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అవి ఫలిస్తున్నాయి కూడా. గతంలో గంటి మోహనచంద్ర బాలయోగి ఇదే నియోజకవర్గం నుంచి లోక్‌స‌భ‌కు ప్రాతినిధ్యం వహించి దేశంలోనే అత్యున్న‌త‌మైన లోక్‌స‌భ స్పీక‌ర్ ప‌ద‌వి అలంక‌రించారు.

ఆయనకు ఉన్న మంచి పేరు ప్రజలకు చేరువగా ఉంటారు అన్నది. ఎవరు ఏం చెప్పినా వింటారు. సమస్యలపై అవగాహన పెంచుకుంటారు. స్థానికంగా అధికారులను పిలిచి మాట్లాడతారు. సమస్యలను పరిష్కరిస్తారు. తద్వారా ఆయన సాధారణ ప్రజలకు చేరువ అయ్యారు.

ఇదే విధానాన్ని ఇప్పుడు ఆయన వారసుడిగా హరీష్ మాధురి కొనసాగిస్తున్నారు. సాధారణంగా అమలాపురం నగరంలోనూ అమలాపురం నియోజకవర్గంలో పైపైన‌ కనిపించే ప్రాంతాల్లో ఉన్న సమస్యలను పరిష్కరించడం వరకు అయితే దీని గురించి పెద్దగా చెప్పుకోవాల్సిన అవకాశం ఉండేది కాదు. అవసరము ఉండేది కాదు.

కానీ గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ విద్యుత్ సౌకర్యం లేని ప్రాంతాలు నీటివస‌తులు లేని ప్రాంతాలు మారుమూల ప్రాంతాల్లో కూడా ఆయన మౌలిక సదుపాయాలను కల్పించే దిశగా అక్కడి ప్రజలకు కనీస వైద్యం అందించే దిశగా అడుగులు వేస్తున్నారు. వారి తరఫున పార్లమెంటులోనూ మాట్లాడుతున్నారు. సమస్యలను ఓపిగ్గా వినడంతో పాటు ఎంతమంది తనను కలిసేందుకు వచ్చినా అపాయింట్మెంట్ ఇస్తున్నారు. ఇది తండ్రి వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్న నాయకుడిగా ఆయనకు మంచి పేరు తీసుకువ‌స్తోంది.