వీవీఐపీలు…ప్రత్యేకించి ముఖ్యమంత్రుల కాన్వాయ్ లు వెళ్లే దారిలో ట్రాఫిక్ ఎక్కడికక్కడ నిలిచిపోతుంది. అనుకోని కారణాల వల్ల సీఎం వెళ్లడం కాస్తంత లేటైందంటే… ఇక నడిరోడ్డుపై సామాన్య వాహనదారులు గంటల తరబడి నిలబడిపోవాల్సిన పరిస్థితి నిత్యం కనిపిస్తూనే ఉంది. ఈ తరహా పద్ధతిపై తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు.
తాను వెళుతున్నానని చెప్పి సామాన్య జనాన్ని ఎంతసేపని అలా రోడ్డుపై నిలబెడతారంటూ ఆయన పోలీసు అధికారుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకపై ఇలాంటివి పునరావృతమైతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
బుధవారం ఢిల్లీ వెళ్తున్న క్రమంలో రేవంత్ రెడ్డి శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్లారు. ఈ క్రమంలో ఎయిర్ పోర్టు సమీపంలో పెద్ద ఎత్తున ట్రాఫిక్ నిలిచిపోయిన వైనాన్ని చూసిన ఆయన అసహనానికి గురయ్యారు. తక్షణమే తెలంగాణ డీజీపీగా ఇటీవలే పదవీ బాధ్యతలు చేపట్టిన సీనియర్ ఐపీఎస్ అధికారి సీవీ ఆనంద్ తో ఆయన ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు.
తాను వస్తున్నానని చెప్పి సామాన్య జనాన్ని అలా రోడ్లపై ఎంతసేపంటే అంతసేపు నిలిపివేయడం ఏం బాగోలేదని రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినా తాను వెళ్లేదారిలో మాత్రమే ట్రాఫిక్ ఆపితే సరిపోతుంది కదా… అలా కాకుండా తాను వెళ్లే రూట్ లో రెండో లైన్ లో ఎదురుగా వస్తున్న వాహనాలను కూడా ఆపాల్సిన అవసరం ఏముందని కూడా ఆయన ప్రశ్నించారట.
అంతేకాకుండా తన కాన్వాయ్ పేరు చెప్పి సామాన్య జనాన్ని ఇబ్బంది పెడితే సహించేది లేదని కూడా రేవంత్ రెడ్డి ఒకింత కఠువుగానే చెప్పారట. తన కాన్వాయ్ పేరిట ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించిన పోలీసు అధికారులపై చర్యలు చేపట్టాలని కూడా సీఎం ఆధేశాలు జారీ చేశారట. ఈ విషయంపై తాను గతంలోనే స్పష్టమైన ఆదేశాలు జారీ చేశానని చెప్పిన రేవంత్… వాటిని ఎందుకు అమలు చేయడం లేదని కూడా రేవంత్ నిలదీశారట. ఇకపై ఈ తరహా ధోరణిని తాను ఎంతమాత్రం సహించేది లేదని కూడా ఆయన తేల్చి చెప్పారట.
సీఎం ఆగ్రహాన్ని చవిచూసిన డీజీపీ సీవీ ఆనంద్… ఆ వెంటనే రాష్ట్రంలోని అన్ని పోలీసు కమిషనరేట్ల పరిధిలోని పోలీసు అధికారులతో సమావేశం అయ్యారట. సీఎం కాన్వాయ్ వస్తున్నప్పటికీ జనరల్ ట్రాఫిక్ కు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకోవాలని ఆయన సూచించారట.
సీఎం చెప్పినట్లుగా సీఎం కాన్వాయ్ వెళుతున్నా… ఆయా రూట్లలో సింగిల్ లైన్ ట్రాఫిక్ ను నియంత్రించి… రెండో లైన్ లో ట్రాఫిక్ ను అనుమతించాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు కొత్తగా అడిషనల్ డీజీ ఆధ్వర్యంలో కొత్త ట్రాఫిక్ బ్యూరోను ఏర్పాటు చేయనున్నట్లు డీజీపీ తెలిపారు. మొత్తంగా ఇకపై సీఎం కాన్వాయ్ వెళుతున్నా సింగిల్ లేన్ ట్రాఫిక్ ను మాత్రమే నిలిపివేస్తారు. సెకండ్ లైన్ లో వాహనాలను యధాతథంగా అనుమతిస్తారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates