ఎంత పెద్ద నాయకుడు ఫోన్ చేసినా పట్టించుకోకండి: అనిత

టీడీపీ మహిళా నేత, ఏపీ హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత నోట నుంచి వచ్చే మాటలు ఎప్పటికప్పుడు వైరల్ గా మారుతూ ఉంటాయి. అంతేకాకుండా ఆయా వర్గాలకు చెందిన వారిని ఎప్పటికప్పుడు ఆమె షాక్ లకు గురి చేస్తూ ఉంటారు. తాజాగా ఆమె తీసుకున్న ఓ నిర్ణయం పార్టీలతో సంబంధం లేకుండా అన్ని రాజకీయ పార్టీలకు చెందిన నేతలకు భారీ షాక్ ఇస్తూ ఆమె ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. వాహనాలు నడిపే సమయంలో ట్రాఫిక్ రూల్స్ పాటించని నేతలకు సాధారణ జరిమానాలకు బదులుగా రెట్టింపు జరిమానాలు విధించాలని ఆమె ఆదేశాలు జారీ చేశారు.

అనకాపల్లి జిల్లాలో మంగళవారం ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ వినియోగంపై ఓ అవగాహన ర్యాలీ జరిగింది. నక్కపల్లి పరిధిలో జరిగిన ఈ ర్యాలీలో హోం మంత్రి హోదాలో అనిత స్వయంగా పాలుపంచుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలపై నమోదు అవుతున్న కేసుల్లో రాజకీయ నేతల జోక్యం అదికంగా ఉంటోందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ట్రాఫిక్ రూల్స్ వాయిలేషన్ కేసులకు సంబంధించి ఇకపై ఎంత పెద్ద రాజకీయ నేత ఫోన్ చేసినా పట్టించుకోవాల్సిన అవసరం లేదని ఆమె పోలీసు అధికారులకు సూచించారు.

ఇక రాజకీయ నేతలే ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తే ఎలా అనే అంశం కూడా ఈ సందర్భంగా చర్చకు రాగా.. దానిపై అనిత తనదైన శైలిలో స్పందించారు. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించిన సందర్భాల్లో సామాన్యులకు జరిమానాలు విధించడం సరైనదేనని చెప్పిన అనిత… ఈ ఉల్లంఘనలకు రాజకీయ నేతలు పాల్పడితే..వారిపై డబుల్ ఫైన్ లు విధించాలని ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. నేతలు సామాన్య జనానికి ఆదర్శంగా నిలబడాలన్న మాటను గట్టిగానే పలికిన అనిత… ట్రాఫిక్ నిబంధనలను నేతలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. లేని పక్షంలో వారికి రెట్టింపు జరిమానాలు తప్పవన్నారు. ఈ విషయంలో ఏ పార్టీ వారన్న అంశాన్ని చూడకుండా వ్యవహరించాలని ఆమె పోలీసు అధికారులకు సూచించారు.