ఏడు కొండ‌ల‌వాడికి ఇక‌నైనా న్యాయం జ‌రిగేనా?

అఖిలాండ కోటి బ్ర‌హ్మాండ నాయ‌కుడు, తిరుమ‌ల శ్రీవారి ద‌ర్శ‌నం ఎంత పుణ్య‌మ‌ని భ‌క్తులు భావిస్తారో.. ఆయ‌న ల‌డ్డూ ప్ర‌సాదాన్ని అంతే ప‌విత్రంగా భ‌క్తులు భావిస్తారు. అయితే.. 2022 నుంచి ఈ ల‌డ్డూ క‌ల్తీ అయింద‌ని.. దీనిలో ఇత‌ర ప‌దార్ధాల‌ను క‌ల్తీ చేశార‌ని.. సీబీఐ ఇప్ప‌టికే నివేదిక ఇచ్చింది. ఈ క్ర‌మంలో రాష్ట్ర ప్ర‌భుత్వం దీనిపై మ‌రింత లోతుగా విచార‌ణ చేసేందుకు దోషుల‌ను గుర్తించేందుకు.. మాజీ ఐఏఎస్ అధికారి దినేష్ కుమార్ నేతృత్వంంలో ఏక‌స‌భ్య క‌మిష‌న్ వేసింది.

సుమారు 50 రోజుల పాటు ఈ వ్య‌వ‌హారంపై అధ్యయనం చేసిన దినేష్ కుమార్‌.. తాజాగా స‌ర్కారుకు నివేదిక అందించారు. దీనిలో ఆయ‌న ల‌డ్డూ ప్ర‌సాదం క‌ల్తీ కావ‌డానికి మూల కారకుడు.. ఈయ‌నే అంటూ.. అప్ప‌టి ఈవో.. ధ‌ర్మారెడ్డి పేరును ప్ర‌స్తావించారు. నిజానికి క‌ల్తీ నెయ్యి తిరుమ‌ల కొండ ఎక్క‌డానికి అవ‌స‌ర‌మైన అన్ని ఏర్పాట్లు ధ‌ర్మారెడ్డి చేతుల మీదుగానే జ‌రిగాయ‌ని స్ప‌ష్టం చేశారు. నిబంధ‌న‌ల‌ను స‌ర‌ళీక‌రించార‌ని.. త‌ద్వారా క‌ల్తీ నెయ్యి సంస్థ‌లు చెల‌రేగిపోయాయ‌ని తెలిపారు.

వైవీ పాత్ర ఎంత‌?

ధ‌ర్మారెడ్డి ఈవోగా ఉన్న‌ప్పుడు.. నెయ్యి విష‌యంలో నిబంధ‌న‌లు మార్చారు. అయితే.. వీటిని ఆయ‌న నేరుగా అమ‌లు చేయ‌లేదు. పాల‌క మండ‌లి ముందు పెట్టారు. అయితే.. ధ‌ర్మారెడ్డిని గుడ్డిగా విశ్వ‌సించిన అప్ప‌టి పాలక మండ‌లి చైర్మ‌న్ వైవీ సుబ్బారెడ్డి.. ఈ వ్య‌వ‌హారాన్ని లైట్ తీసుకుని.. చ‌ర్చ‌కు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వ‌కుండానే అమ‌లు చేశారు. అనంత‌ర కాలంలో భ‌క్తుల నుంచి విమ‌ర్శలు వ‌చ్చాయి. ల‌డ్డూ నాణ్య‌త ప్ర‌శ్నార్థ‌కంగా మారింది. దీంతో విచార‌ణ‌కు వైవీనే ఆదేశించారు. కానీ, ఇక్క‌డ కూడా ధ‌ర్మారెడ్డినే అన్నీ చూసుకో అని వ‌దిలేయ‌డంతో ఆయ‌న ఈ రిపోర్టును తొక్కిపెట్టారు.

త‌ర్వాత వ‌చ్చిన వారు..

త‌ర్వాత వ‌చ్చిన ఈవో అనిల్ కుమార్ సింఘాల్ కూడా.. ఈ విష‌యం తెలిసిన‌ప్ప‌టికీ.. పెద్ద‌లు సంత‌కాలు పెట్టిన త‌ర్వాత‌.. తాను జోక్యం చేసుకుంటే మంచిది కాద‌ని భావించి ఆయ‌న కూడా మౌనంగా ఉండిపోయారు. కాగా.. నాటి అకృత్యంలో అప్ప‌టి పోటు అధికారులు, నెయ్యి శాంపిళ్ల‌ను త‌నిఖీచేసే అధికారుల పాత్ర కూడా ఉంద‌ని ఏక‌స‌భ్య క‌మిష‌న్ తేల్చేసింది.

మ‌రీ ముఖ్యంగా ధ‌ర్మారెడ్డి పాత్ర‌ను ప్ర‌స్తావించింది. ఈ నేప‌థ్యంలో ఆయ‌న‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరింది. కాగా.. సీబీఐ రిపోర్టు కూడా దాదాపు ఇలానే ఉంది. ధ‌ర్మారెడ్డిపై క్ర‌మ‌శిక్ష‌ణ చ‌ర్య‌ల‌తో పాటు క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని సూచించింది. మ‌రి ఇప్ప‌టికైనా ఏడుకొండ‌ల‌వాడికి న్యాయం జ‌రుగుతుందా? అనేది చూడాలి.