వైసీపీ నేతలకు మరో చిక్కు ఎదురు కానుందా? మరో కీలక పరిణామాన్ని ఫేస్ చేయాల్సిన పరిస్థితి వస్తుందా? అంటే.. ఔననే సమాధానమే వినిపిస్తోంది. వైసీపీ హయాంలో మద్యం డిస్టిలరీలను(తయారీ కంపెనీలు) బెదిరించి కమీషన్లు తినేసిన కేసు ప్రస్తుతం మూడు రూపాలు సంతరించుకుంది. 1) ఈ కేసును రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం విచారిస్తోంది. ఈ క్రమంలో 38 మందిపై కేసు నమోదైంది. పలువురు జైలు పాలై.. ఇటీవల కొందరు షరతులతో కూడిన బెయిల్పై బయటకు వచ్చారు.
2) ఎన్ ఫోర్స్మెంటు డైరెక్టరేట్: ఈ అక్రమ మద్యం లావాదేవీలకు సంబంధించిన సొమ్మును విదేశాలకు తరలించారన్న వాదన ఉంది. ఈ క్రమంలో మనీలాండరింగ్ కూడా జరిగిందన్న ఆరోపణలపై ఈడీ అధి కారులు సోధిస్తున్నారు. దీనిపై ఏ1గా ఉన్న కసిరెడ్డి రాజశేఖర్రెడ్డికి సంబంధించిన 300 కోట్ల రూపాయల ఆస్తులను సీజ్ చేశారు. అలానే.. మరికొందరిపైనా విచారణ కొనసాగుతోంది. ఇంతలో ఈ ఆదాయాలకు సంబంధించిన పన్ను ఎగవేతల అంశం కూడా తెరమీదికి వచ్చింది.
3) ఐటీ ఎంట్రీ: ఇప్పుడు తాజాగా నాటి కేసులో ఇన్ కం ట్యాక్స్ అధికారులు కూడా రంగంలోకి దిగేందుకు రెడీ అయ్యారు. ఈడీ అధికారుల నుంచి వారు సమాచారం సేకరించారు. ఆనాటి డాక్యుమెంట్లు, బ్యాంకు ఖాతాలు, నగదు లావాదేవీలు.. ఇలా అన్ని అంశాలను వారు పరిశీలిస్తున్నారు. సదరు నగదుకు సంబం ధించి పన్ను ఎగవేతలు జరిగినట్టు గుర్తించే పనిలో ఉన్నారు. ఒకవైపు నగదు అక్రమాలపై రాష్ట్ర పోలీసులు.. నగదు లాండరింగ్(విదేశాలకు పంపేయడం)పై ఈడీ, ఇప్పుడు ట్యాక్స్ ఎగవేతలపై ఐటీ అధికారులు ముసురుకున్నారు. దీంతో వైసీపీకి ముప్పేట చుక్కలు కనిపించే అవకాశం ఉందని తెలుస్తోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates