ఏపీ సీఎం చంద్రబాబు గత 2024లో కూటమి కట్టి అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత.. ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలతోపాటు.. మరికొన్నింటిని వేదికలపైనే ప్రకటిస్తూ.. అమలు చేస్తున్నారు. ఇలాంటి వాటిలో పీ-4 ఒకటి. దీనిద్వారా.. రాష్ట్రంలో పేదరికాన్ని తగ్గించే చర్యలు చేపట్టారు. ఉన్నతస్థాయిలో ఉన్నవారు.. పేదలను దత్తత తీసుకుని.. వారి బాగోగులు చూసుకునే కార్యక్రమమే పీ-4. దీనికి తొలినాళ్లలో విమర్శలు వచ్చినా.. ప్రస్తుతం 10 లక్షల మందిపైచిలుకు పేదలను ఉన్నతస్థాయి వారు దత్తత తీసుకున్నారు.
ఇలాంటి కార్యక్రమమే మరొకటి ప్రకటించారు.. సీఎం చంద్రబాబు. అదే లేబర్ అడ్డా మరి ఇదేంటి? దీనివల్ల ప్రయోజనం ఎంత? అనేది ఆసక్తిగా మారాయి. రాష్ట్రంలోని కార్మికుల సంఖ్యను ప్రభుత్వం తేల్చనుంది. దీనిలో స్కిల్డ్ లేబర్, అన్ స్కిల్డ్ లేబర్ను గుర్తిస్తారు. వీరికి గుర్తింపు కార్డులు ఇస్తారు. తద్వారా.. వీరికి ప్రత్యేక శిక్షణ ఇచ్చి.. స్కిల్డ్ లేబర్గా తయారు చేస్తారు. ఇప్పటికే నైపుణ్యం ఉన్నవారికి కూడా మరింత శిక్షణ ఇచ్చి, హైపవర్ స్కిల్డ్ లేబర్గా గుర్తిస్తారు.
ఇలా.. వీరికి శిక్షణ ఇచ్చే కేంద్రాలనే లేబర్ అడ్డాలుగా పేర్కొంటున్నారు. తద్వారా కార్మికుల సంక్షేమం, జీవితాలను సమూలంగా మార్చాలన్నది చంద్రబాబు ఉద్దేశం. ఈ కేంద్రాలు కార్మికులకు పని లేని రోజుల్లో వారి నైపుణ్యాన్ని పెంచే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లుగా మారుతాయి. వచ్చే మూడు మాసాల్లో రాజధాని అమరావతితో సహా 15 ప్రధాన నగరాల్లో లేబర్ అడ్డాలను ఏర్పాటు చేయనున్నారు. అత్యాధునిక పనిముట్లతో పాటు ఈఎస్ఐ ఆస్పత్రుల ద్వారా మెరుగైన వైద్యం అందించేలా చర్యలు తీసుకుంటారు.
ప్రయోజనం ఏంటి?
వచ్చే ఏడాదిలో రాష్ట్రానికి మరిన్ని ప్రైవేటు కంపెనీలు రానున్నాయి. ఇప్పటికే చేసుకున్న ఒప్పందాల ప్రకారం.. పెట్టుబడులు పెట్టనున్నాయి. ఆయా కంపెనీల నిర్మాణాలు సాగేప్పుడు .. వారికి నైపుణ్యం ఉన్న కార్మికులు కావాల్సి ఉంటుంది. ఈ క్రమంలో రాష్ట్రంలో నైపుణ్యం ఉన్న కార్మికులను పెంచడం ద్వారా పెట్టుబడి దారులు వేర్వేరు ప్రాంతాల నుంచి కార్మికులను తెచ్చుకోకుండా.. స్థానికులకు ఉపాధి కల్పించేలా ప క్కా ప్రణాళికను అమలు చేస్తున్నారు. దీనివల్ల.. కార్మికులకు మేలు జరుగుతుందని.. రాష్ట్రానికి కూడా ఉపయోపడుతుందని అంచనా వేస్తున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates