సొంత పార్టీ నాయకుడు తప్పు చేస్తే ఒకవిధంగా.. ప్రత్యర్థి పార్టీ నేతలు తప్పులు చేస్తే మరో విధంగా మారి పోయిన రాజకీయాలు ప్రస్తుత మనకు అనేకం కనిపిస్తున్నాయి. సొంత నేతలు తప్పు చేస్తే సమర్థించిన వైసీపీ నేతలు.. వారిని వెనుకేసుకు వచ్చిన ఉదంతాలు కూడా ఉన్నాయి. అయితే.. టీడీపీ అలా వ్యవహరించడం లేదు. తమ్ముడు తమ్ముడే.. అన్నట్టుగా వ్యవహరిస్తోంది. తప్పు చేస్తే.. శిక్ష తప్పదు అనే విషయాన్ని గట్టిగానే తేల్చి చెబుతున్నారు.. సీఎం చంద్రబాబు.
శనివారం ఉదయం అనంతపురంలోని కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు సమక్షంలోనే ఆయన అనుచరులు వ్యక్తిగత భద్రతా సిబ్బంది టోల్ గేట్ సిబ్బందిపై దాడులకు పాల్పడిన విషయం తెలిసిందే. మహిళా ఉద్యోగినిని జుట్టు పట్టుకుని లాగడం.. బూతులు తిట్టడం.. పురుష ఉద్యోగులపై పిడిగుద్దులు గుద్దడం వంటి కనిపించాయి. అంతేకాదు.. టోల్ ప్లాజా వద్ద ఏర్పాటు చేసిన గేట్లను కూడా తొలగించారు. ఇలా.. ఒక విధంగా సిబ్బందిని భయ భ్రాంతులకు గురి చేశారు.
ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. వాస్తవానికి అధికార పార్టీ ఎమ్మెల్యే కాబట్టి.. పెద్దగా చర్యలు ఏం ఉంటాయి? ఎవరు పట్టించుకుంటారు? అని కొందరు భావించారు. ఎందుకంటే వైసీపీ హయాంలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యేలు దారుణంగా వ్యవహరించినా.. అప్పటి సీఎం జగన్.. ఆయన పార్టీ సీనియర్లు కూడా వెనుకేసుకు వచ్చిన ఉదంతాలు అనేకం ఉన్నాయి. కానీ.. చంద్రబాబు అలా చేయలేదు.
టోల్ గేట్ సిబ్బందిపై దాడులకు పాల్పడిన వారు.. మహిళా ఉద్యోగినిని జుట్టు పట్టుకుని ఈడ్చిన వారిని వదిలి పెట్టేది లేదని స్పష్టం చేశారు. నేతలు ఎంతటి వారైనా.. తప్పులు చేస్తే సహించేది కూడా లేదని తేల్చి చెప్పారు. ఈ క్రమంలో దాడులకు పాల్పడిన వారిపై కేసులు నమోదు చేయాలని అనంతపురం జిల్లా పోలీసులను చంద్రబాబు ఆదేశించారు.
మహిళా ఉద్యోగి జుట్టు పట్టుకున్న వారిపై కఠిన చట్టాల కింద కేసులు పెట్టాలన్నారు. ఇదేసమయంలో ఎమ్మెల్యే సమక్షంలోనే జరిగిన దాడిపై ఆయన వివరణ కూడా తీసుకోవాలని పార్టీ పరంగా రాష్ట్ర అధ్యక్షుడిని చంద్రబాబు ఆదేశించారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates