ఆప‌రేష‌న్ లోట‌స్‌… ఇక‌, వైసీపీ వంతేనా?

కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏ ప్ర‌భుత్వం `ఆప‌రేష‌న్ లోట‌స్` ప్రారంభించింది. రాజ్య‌స‌భ స‌హా లోక్‌స‌భ‌లో ప్ర‌తిప‌క్ష పార్టీల‌కు చెందిన ఎంపీల‌ను త‌న‌వైపు తిప్పుకొనే ప్ర‌య‌త్నం చేసింది. ఈ క్ర‌మంలో తాజాగా ఎవ‌రూ ఊహించ‌నివిధంగా ఆమ్ ఆద్మీపార్టీ(ఆప్‌)కి చెందిన ఏడుగురు ఎంపీల‌ను బీజేపీ త‌న‌దైన శైలిలో త‌న కూట‌మిలో చేర్చుకుంది. ఇది నిజానికి ఎవ‌రూ ఊహించ‌నిప‌రిణామ‌మే. ప్ర‌స్తుతం రాజ్య‌స‌భ స‌భ్యుడిగా ఉన్న రాఘ‌వ్ చ‌ద్దా ఒక్క‌రే పార్టీ నుంచి దూర‌మ‌వుతార‌ని ఆప్ లెక్క‌లు వేసుకుంది. కానీ, అనూహ్యంగా ఆయ‌న‌తో పాటు ఏడుగురిని బీజేపీ లాగేసింది.

ఒక‌వైపు ఈ వ్య‌వ‌హారం ఢిల్లీని కుదిపేస్తుంటే.. మ‌రోవైపు వైసీపీ విష‌యం కూడా తెర‌మీద‌కు వ‌చ్చింది. వాస్త‌వానికి బీజేపీతో నేరుగా చేతులు క‌ల‌ప‌క‌పోయినా.. ప‌రోక్షంగా మిత్ర‌ప‌క్షాల‌ను మించిన మిత్ర‌ప‌క్షంగా వైసీపీ వ్య‌వ‌హ‌రిస్తోంది. అయినా కూడా.. వైసీపీ రాజ్య‌స‌భ స‌భ్యుల‌పై బీజేపీ క‌న్నేసింద‌న్న‌ది ఓ ప్ర‌ముఖ ఆంగ్ల టీవీ చానెల్‌లో సీనియ‌ర్ వ్యాఖ్యాత ఒక‌రు చెప్పుకొచ్చారు. త‌న‌కు ఉన్న స‌మాచారం మేర‌కు.. వైసీపీ నుంచి కూడా రాజ్య‌స‌భ స‌భ్యుల‌ను బీజేపీ తీసుకునే ప్ర‌య‌త్నంలో ఉంద‌న్నారు. అయితే..అది ఇప్పుడా.. లేక కొంత ఆల‌స్యం అవుతుందా? అనేది త‌న‌కు తెలియ‌ద‌ని వ్యాఖ్యానించారు.

గ‌తంలో కూడా..

గ‌తంలో కూడా వైసీపీ నుంచి రాజ్య‌స‌భ స‌భ్యుల‌ను చేర్చుకునేందుకు బీజేపీ ప్ర‌య‌త్నించింద‌న్న‌ది వాస్త‌వం. అయితే.. అప్ప‌ట్లో జ‌గ‌న్ చ‌క్రం వేసి అడ్డుకున్నారు. కానీ.. ఇప్పుడు వైసీపీ రాజ్య‌స‌భ స‌భ్యుల్లో కీల‌క‌మైన వైవీ సుబ్బారెడ్డి, ఆళ్ల అయోధ్య రామిరెడ్డి వంటి కీల‌క నేత‌ల‌పై కేసులు ఉన్నాయి. ఈకేసులు ముసురుకుంటున్న నేప‌థ్యంలో వారు వైసీపీలో ఉండ‌డం క‌న్నా.. త‌మ‌కు సేఫ్‌గా ఉండే జోన్‌లో ఉంటేనే బాగుటుంద‌ని భావిస్తున్నార‌ని త‌ర‌చుగా చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి. ఈ ప‌రిణామాల క్ర‌మంలోనే తాజాగా ఆప్ ఎంపీల‌ను బీజేపీ తీసుకోవ‌డంతో వైసీపీ ఎంపీల వ్య‌వ‌హారం కూడా హాట్ టాపిక్‌గా మారింది.

వైసీపీ మాటేంటి?

ఎంపీల విష‌యంలో వైసీపీ ఎప్పుడూ బేఫిక‌ర్‌గానే ఉంటోంది. ఏం జ‌రిగినా..సిద్ధ‌మేన‌న్న ధోర‌ణిలోనే జ‌గ‌న్ వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఇటీవ‌ల అర‌కు ఎంపీ(లోక్‌స‌భ‌) బీజేపీ నేత‌ల‌తో ట‌చ్‌లోకి వెళ్లార‌న్న వార్త‌లు వ‌చ్చాయి. అయితే..వాటిని ఆమె ఖండించ‌లేదు. పైగా..ఈ విష‌యాన్ని జ‌గ‌న్ కూడా లైట్ తీసుకున్నారు.

“వెళ్లే వాళ్లు వెళ్తారు.. ఆపుతామా?“ అని న‌ర్మ‌గ‌ర్భంగా వ్యాఖ్యానించారు. సో.. మొత్తంగా ఎవ‌రు ఉన్నా.. ఎవ‌రు పోయినా.. వైసీపీ అన్నింటికీ సిద్ధంగానే ఉంద‌న్న ప‌రిస్థితి స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. ఇక‌.. ఇప్పుడు రాజ్య‌స‌భ స‌భ్యుల విష‌యంలోనూ అలానే వ్య‌వ‌హ‌రించే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది.