కొత్త పార్టీ పేరుతో భలే షాక్ ఇచ్చిన కవిత

తెలంగాణ జాగృతి అధ్య‌క్షురాలు.. మాజీ సీఎం కేసీఆర్ త‌న‌య‌.. క‌విత పార్టీ పేరును ప్ర‌క‌టించారు. `తెలంగాణ రాష్ట్ర సేన‌`(టీఆర్ ఎస్‌)గా ఆమె త‌న పార్టీని ప్ర‌క‌టించారు. మేడ్చ‌ల్‌లోని మునీరాబాద్‌లో నిర్వ‌హించిన కార్య‌క్ర‌మంలో క‌విత సొంత పార్టీ పేరును ప్ర‌క‌టించారు. తొలుత ఆమె హైద‌రాబాద్ నుంచి ప్ర‌త్యేక ర్యాలీగా మునీరాబాద్ చేరుకున్నారు. అనంత‌రం.. ఇక్క‌డి ఓ క‌న్వెన్ష‌న్ హాల్‌లో పార్టీ ఆవిర్భావ స‌భ‌ను నిర్వ‌హించారు.

జీవితంలోనే ప్ర‌త్యేకం..                                                    

పార్టీ ఆవిర్భావ దినోత్స‌వం.. అనేది త‌న జీవితంలో ప్ర‌త్యేకమని క‌విత పేర్కొన్నారు. గ‌త ఉద్య‌మంలో తాను పోషించిన పాత్ర‌, జాగృతి పాత్ర‌ను ఈ సంద‌ర్భంగా ఆమె ప్ర‌స్తావించారు. జాగృతి ని ముందుకు తీసుకువెళ్ల‌డంలో మ‌హిళ‌లు ఎంతో స‌హ‌క‌రించార‌ని తెలిపారు. బ‌తుక‌మ్మ సంస్కృతిని ముందుకు తీసుకువెళ్లి.. ఉద్య‌మంలో కీల‌క పాత్ర పోషించామ‌న్నారు. ఏ ఉద్య‌మానికైనా శ‌క్తులు ఉంటాయ‌ని.. తెలంగాణ ఉద్య‌మానికి సాంస్కృతిక పునాది వేసిన ఘ‌న‌త‌ జాగృతిదేన‌ని పేర్కొన్నారు.

దీనికి ముందు..

టీఆర్ ఎస్ పార్టీ ప్ర‌క‌ట‌న‌కు ముందు.. హైద‌రాబాద్‌లోని జాగృతి నివాసంలో ప్ర‌త్యేక పూజ‌లు చేశారు. అనంతరం.. స‌ర్వ‌మ‌త ప్రార్థ‌న‌లు నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా తొలుత భర్త‌, త‌ర్వాత కుమారుడు క‌విత‌కు విషెస్ చెప్పారు. అనంత‌రం గ‌న్ పార్కు ద‌గ్గ‌ర తెలంగాణ అమ‌రవీరుల‌కు క‌విత నివాళులర్పించారు.

అక్క‌డి నుంచి 25-30 కార్ల కాన్వాయ్‌తో మేడ్చ‌ల్‌కు చేరుకున్నారు. ఈ మ‌ధ్య‌లో ప‌లు చోట్ల క‌విత కాన్యాయ్‌కు మ‌హిళ‌ల‌కు స్వాగ‌తం ప‌లికారు. కొన్ని ప్రాంతాల్లో కారుదిగి పార్టీ అభిమానుల‌ను ఆమె ప‌ల‌క‌రించారు. స‌భ‌కు రావాల‌ని ఆహ్వానించారు. స‌భ నిర్వ‌హ‌ణ‌కు భారీ ఏర్పాట్లే చేశారు.

పార్టీ జెండా ఇదీ..

ప‌సుపు వ‌ర్ణంతో కూడిన ప‌తాకం.. మ‌ధ్య‌లో నీలం వ‌ర్ణంలో తెలంగాణ రాష్ట్రం మ్యాప్ ఉంది. గ‌తంలో బీఆర్ ఎస్ పార్టీ జెండా కూడా.. గులాబీ రంగులో ఉండి.. మ‌ధ్య‌లో తెలంగాణ‌రాష్ట్ర మ్యాప్ ఉండ‌డం గ‌మ‌నార్హం.

ఈ పార్టీ పేరుతో బీఆర్ఎస్ పార్టీకి పెద్ద చిక్కే వచ్చి పడినట్లయింది. TRS పేరుకు తిరిగి తెచ్చుకోవాలనుకుంటున్న కేసీఆర్ కు కవిత పెద్ద షాక్ ఇచ్చినట్టు విశ్లేషకులు చెబుతున్నారు. ఇప్పుడు కేసీఆర్ కూడా TRS అని మార్చుకుంటే ప్రజల్లో కన్ఫ్యూషన్ తప్పదని తెలుస్తోంది.