వైసీపీకి కొత్త పేరు పెట్టిన బాబు

టీడీపీ శ్రేణుల‌కు ఆ పార్టీ అధినేత‌, సీఎం చంద్ర‌బాబు ప‌లు జాగ్ర‌త్త‌లు చెప్పారు. వైసీపీని గొడ్డ‌లి పార్టీగా అభివ‌ర్ణించిన ఆయ‌న‌.. ఆ పార్టీతో జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని సూచించారు. గ‌తంలో త‌న‌ను వివేకానంద‌రెడ్డి దారుణ హ‌త్య‌లో ఇరికించే ప్ర‌య‌త్నం చేశార‌ని.. ఇప్పుడు కూడా పెద్ద ద‌స్త‌గిరి హ‌త్య‌లో ఇరికించేందుకు టీడీపీ వారిని ఎంచుకున్నార‌ని తెలిపారు. ఇలాంటి పార్టీలు, వ్య‌క్తుల‌తో చాలా అప్ర‌మత్తంగా వ్య‌వ‌హ‌రించాల‌న్నారు. ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు కూడా తీసుకు వెళ్లాల‌ని సూచించారు. పార్టీ కేంద్ర కార్యాల‌యం ఎన్టీఆర్ భ‌వ‌న్‌లో క్ల‌స్ట‌ర్ ఇంచార్జుల‌తో నిర్వ‌హించిన కార్య‌క్ర‌మంలో చంద్ర‌బాబు పాల్గొన్నారు.

“ఏమాత్రం జాగ్ర‌త్త‌గా లేక‌పోయినా.. గొడ్డ‌లి పార్టీ నుంచి మ‌నకు ఇబ్బందులు త‌ప్ప‌వు. ఇప్ప‌టికే అనేక విష‌యాల్లో టీడీపీని ఇరికించే ప్ర‌య‌త్నం చేశారు. వారే హ‌త్య‌లు చేస్తారు.. మ‌న‌పై రుద్దుతారు. ఇలాంటి వారితో ప్ర‌జాస్వామ్యానికి, ప్ర‌జ‌ల‌కు కూడా ఇబ్బందులు త‌ప్ప‌డం లేదు.“ అని వ్యాఖ్యానించారు. ఒక‌ప్పుడు రాజ‌కీయాలు అంటే.. మేధావులు, ఆలోచ‌నా ప‌రులు ఉండేవారని.. వారితో రాజ‌కీయాలు ఎంజాయ్ చేసేవార‌మ‌ని చెప్పిన ఆయ‌న‌.. ఇప్పుడు మాత్రం అరాచ‌క శ‌క్తులు.. చిల్ల‌ర వ్య‌క్తులు, రౌడీల‌తో రాజ‌కీయాలు చేయాల్సి వ‌స్తోంద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

కిల్ల‌ర్ పార్టీ..

వైసీపీకి చంద్ర‌బాబు మ‌రో పేరు కూడా పెట్టారు. ఈ పార్టీని ఆయ‌న కిల్ల‌ర్ పార్టీగా పేర్కొన్నారు. ఇప్ప‌టికే ప‌లువురిని చంపించారని.. అధికారం కోసం ఎంత‌కైనా తెగిస్తార‌ని చెప్పారు. వివేకానంద‌రెడ్డి వంటి సౌమ్యుల‌ను కూడా దారుణంగా హ‌త్య చేయించిన చ‌రిత్ర ఉంద‌న్నారు. మాజీ డ్రైవ‌ర్‌ను దారుణంగా చంపేసి.. ఇంటికి శ‌వాన్ని తీసుకువెళ్లి అప్ప‌గించిన ఘ‌నాపాటీలు ఈ పార్టీలో ఉన్నారంటే.. ఆశ్చ‌ర్యం వేస్తుంద‌న్నారు. నాయ‌కుడు ఎలా ఉంటాడో.. ఆ పార్టీలో ఉండేవారు కూడా అలానే ఉన్నార‌ని ప‌రోక్షంగా జ‌గ‌న్‌పై విమ‌ర్శ‌లు గుప్పించారు. ఇలాంటి పార్టీ విష‌యంలో అప్ర‌మ‌త్తంగా ఉండాల‌న్నారు.

ఇప్ప‌టి నుంచే ..

ఎన్నిక‌ల‌కు సంబంధించి.. ఇప్ప‌టి నుంచే ప్రిపేర్ కావాల‌ని శ్రేణుల‌కు చంద్ర‌బాబు సూచించారు. ప్ర‌భుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమాన్ని ప్ర‌జ‌ల‌కు వివ‌రించ‌డంతోపాటు.. గొడ్డ‌లి పార్టీ అరాచ‌కాల‌ను కూడా ప్ర‌జ‌ల‌కు చెప్పాల‌ని హిత‌వు ప‌లికారు. ఈ విష‌యంలో ఎలాంటి మొహ‌మాటాల‌కు తావులేద‌ని చెప్పారు.

లేక‌పోతే..వారు చేసిన త‌ప్పుల‌ను టీడీపీ కార్య‌క‌ర్త‌లు, నాయ‌కుల‌పై తోసేసి.. దానిని ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు తీసుకువెళ్లి న‌మ్మించే ప్ర‌య‌త్నం చేస్తార‌ని చెప్పారు. గ‌తంలో అనేక ఘ‌ట‌న‌లు జ‌రిగాయ‌న్నారు. పార్టీ ప‌రంగా ప్ర‌తి ఒక్క‌రికీ అండ‌గా ఉంటామ‌ని.. ప్ర‌జ‌ల‌కు మేలు చేయాల‌న్న సంక‌ల్పంతోనే కూట‌మిగా గ‌త ఎన్నిక‌ల్లో విజ‌యం ద‌క్కించుకున్నామ‌న్నారు. వ‌చ్చే 15 ఏళ్లు కూడా కూట‌మిగానే ఎన్నిక‌ల‌కు వెళ్తామ‌ని తెలిపారు.