కేసీఆర్‌కిది పెద్ద ఎదురు దెబ్బే

తెలంగాణ ముఖ్యమంత్రి కావడానికి ముందు కేసీఆర్ ఏంటన్నది పక్కన పెడితే.. అధికారం చేపట్టాక ఆయన ఆత్మవిశ్వాసం, పట్టుదల, మొండితనం ఎలాంటివన్నది అందరికీ తెలుసు. ఆయన ఏదనుకుంటే అది చేస్తారు అంతే. విమర్శలు వచ్చినా, అభ్యంతరాలు ఎదురైనా.. తాను అనుకున్నది చేసుకుపోతారు. మధ్యలో ఏదైనా అవాంతరం ఎదురైనా సరే.. ఆయన వెనక్కి తగ్గరు. నిర్ణయాలు వెనక్కి తీసుకోరు. వైఫల్యాల్ని కూడా అంగీకరించరు. అలాంటి వ్యక్తి ఇటీవల ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమాల విషయంలో వెనకడుగు వేస్తున్న తీరు చర్చనీయాంశం అవుతోంది.

గత ఏడాది తెలంగాణ వ్యాప్తంగా ప్రభుత్వం నియంత్రిత సాగు విధానం తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. దాని ప్రకారం ప్రభుత్వం చెప్పిన పంటనే రైతులు వేయాలి. గ్రామాల్లో పంట కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతుల నుంచి ప్రభుత్వం మద్దతు ధర ఇచ్చి పంటను కొనుగోలు చేస్తుంది. ఐతే ఈ పథకం అనుకున్న ఫలితాలనివ్వలేదు. హామీ ప్రకారం ప్రభుత్వం పూర్తి స్థాయిలో పంటల్ని కొనుగోలు చేయలేకపోయింది. కొన్న పంట ఉత్పత్తులు ప్రభుత్వానికి భారంగా మారాయి. దీంతో ఈ నియంత్రిత సాగు విధానాన్ని రద్దు చేస్తూ ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుంది. గ్రామాల్లో పంట కొనుగోలు కేంద్రాలను కూడా ప్రభుత్వం రద్దు చేసింది.

రైతులు తమకు నచ్చిన పంట వేసుకోవచ్చని ప్రభుత్వం స్పష్టం చేసింది. రైతుల నుంచి పంట కొనుగోలు వల్ల ప్రభుత్వానికి రూ.7500 కోట్లు నష్టం వచ్చినట్లు కేసీఆర్ స్వయంగా ప్రకటించడం గమనార్హం. ప్రభుత్వం వ్యాపార సంస్థ కాదని ఈ సందర్భంగా కేసీఆర్ వ్యాఖ్యానించారు. గత ఏడాది ఘనంగా ప్రకటించిన పథకం విషయంలో కేసీఆర్ సర్కారు ఇలా వెనుకంజ వేయాల్సి రావడం పెద్ద ఎదురు దెబ్బే. మరోవైపు తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ‘ధరణి’ సైతం పెద్ద షాకే ఇచ్చింది.

కొత్త విధానం తీసుకురావడం కోసం మూడు నెలల పాటు రిజిస్ట్రేషన్లు ఆపేయడంతో మూడు నెలల్లో రియల్ ఎస్టేట్, కన్‌స్ట్రక్షన్ రంగాలు కుదేలయ్యాయి. కరోనా దెబ్బకు తోడు ఇది కూడా తోడవడంతో కోలుకోవడం కష్టమైపోతోంది. రియల్ ఎస్టేట్ ఆదాయం మీద ఎక్కువగా ఆధారపడే తెలంగాణకిది కోలుకోలేని దెబ్బే. చివరికి ఇప్పుడు ‘ధరణి’ వ్యవహారం కోర్టుల్లో నలుగుతోంది. కొత్త విధానాన్ని రద్దు చేసి పాత పద్ధతుల్లోనే రిజిస్ట్రేషన్లు చేసుకోమని ప్రభుత్వం చెప్పే పరిస్థితి రావడం కేసీఆర్‌కు మరో గట్టి ఎదురు దెబ్బ. ఎల్ఆర్ఎస్ విషయంలోనూ ప్రభుత్వానికి కోర్టులో ఎదురు దెబ్బే తగిలేలా ఉండటం మరో ప్రమాదకర సూచిక. అసలే దుబ్బాక ఎన్నికల్లో ఓడి, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో చావు తప్పి కన్ను లొట్టబోయిన స్థితిలో ప్రభుత్వ పరంగా ఈ ఎదురు దెబ్బలు కేసీఆర్‌ను ఆందోళనలోకి నెడుతాయనడంలో సందేహం లేదు.