మాజీ సీఎం నాదెండ్ల భాస్కర రావు ఇక లేరు

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర రావు(90) ఇక లేరు. గత కొంతకాలంగా అనారోగ్యంతో సతమతం అవుతున్న నాదెండ్ల సీనియర్…హైదరాబాద్ లోని ఓ ప్రముఖ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. తాజాగా ఆయన ఆరోగ్యం మరింత క్షీణించగా…ఆయనను ఐసీయూలో చేర్చారు. ఈ క్రమంలోనే అనారోగ్యం నుంచి కోలుకోలేక భాస్కర రావు బుధవారం ఉదయం తుది శ్వాస విడిచారు. ప్రస్తుతం ఏపీ కేబినెట్ లో పౌర సరఫరాల శాఖ మంత్రిగా కొనసాగుతున్న నాదెండ్ల మనోహర్… భాస్కర రావు కుమారుడే.

వృత్తి రీత్యా న్యాయవాది అయిన భాస్కరరావు 1970 దశకంలోనే తెలుగు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. 1978లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన నాదెండ్ల సీనియర్… నాడు మర్రి చెన్నారెడ్డి నేతృత్వంలో కొలువుదీరిన మంత్రివర్గంలో కీలక మంత్రిగా పనిచేశారు. కాలక్రమంలో కాంగ్రెస్ పార్టీని వీడిన నాదెండ్ల… 1982లో తెలుగు దేశం పార్టీ ఆవిర్భావంలో కీలక భూమిక పోషించారు. టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ వెన్నంటి నడిచిన భాస్కర రావు… టీడీపీ సహ వ్యవస్థాపకుడిగా పేరు తెచ్చుకున్నారు.

1983లో టీడీపీ అఖండ మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగా… ఎన్టీఆర్ కేబినెట్ లో కీలక స్థానాన్ని దక్కించుకున్న నాదెండ్ల… ఆర్థిక శాఖ మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. అయితే గుండె ఆపరేషన్ నిమిత్తం ఎన్టీఆర్ అమెరికాకు వెళ్లిన సమయంలో తన మద్దతుదారులతో ఎన్టీఆర్ సర్కారును కూలదోసిన నాదెండ్ల ఏపీకి సీఎంగా కొత్త అవతారం ఎత్తారు. అయితే అమెరికా నుంచి తిరిగి వచ్చినంతనే ఎన్టీఆర్.. నాదెండ్ల నుంచి అధికారాన్ని లాగేసుకున్నారు. మొత్తంగా ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచిన నేతగా నాడెండ్ల రికార్డులకెక్కారు.

ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరిన నాదెండ్ల ఖమ్మం నుంచి ఓ దఫా ఎంపీగా విజయం సాదించారు. ఆ తర్వాత ప్రత్యక్ష రాజకీయాలకు దాదాపుగా దూరంగా జరిగిన నాదెండ్ల సీనియర్… 2019లో బీజేపీలో చేరారు. నాడు హైదరాబాద్ పర్యటనకు వచ్చిన నాటి బీజేపీ అధ్యక్షుడు, ప్రస్తుత కేంద్ర హోం శాఖ మంత్రిగా ఉన్న అమిత్ షా సమక్షంలో ఆయన కమలం తీర్థం పుచ్చుకున్నారు. ఈ పరిణామంతో నాదెండ్ల సీనియర్ మరోమారు ప్రత్యక్ష రాజకీయాల్లో యాక్టివ్ అవుతారని భావించినా… ఆ దిశగా పెద్దగా అడుగులే పడలేదు.