రేవంత్ రెడ్డి `వ‌న్ మ్యాన్ ఆర్మీ`… సరిపోవట్లేదా?

తెలంగాణ అధికార పార్టీ కాంగ్రెస్‌లో వ‌న్ మ్యాన్ `ఆర్మీ`గా ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి క‌నిపిస్తున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో పార్టీని అధికారంలోకి తీసుకువ‌చ్చేందుకు ఆయ‌న శ్ర‌మించారు. ఇదే.. ఆయ‌న‌కు ఎంతో మంది సీనియ‌ర్ల‌ను కూడా ప‌క్క‌న పెట్టి.. ముఖ్య‌మంత్రి పీఠం ద‌క్కేలా చేసింద‌న్న వాద‌న ఉంది. ఎన్నిక‌ల వ‌ర‌కు రేవంత్ దూకుడును అంద‌రూ స‌మ‌ర్థించారు. బ‌ల‌మైన బీఆర్ ఎస్ పార్టీని నిలువ‌రించేందుకు అంద‌రూ.. అప్ప‌ట్లో స‌ర్దుకు పోయారు.

కానీ, పార్టీ అధికారం లోకి వ‌చ్చిన త‌ర్వాత కూడా సీఎంగా రేవంత్ రెడ్డి వ‌న్ మ్యాన్ ఆర్మీగా వ్య‌వ‌హ‌రించడం.. తెలిసిందే. హైడ్రా వంటి కీల‌క వ్య‌వ‌స్థ‌ను ఆయ‌న తీసుకువ‌చ్చారు. అదేస‌మ‌యంలో ఆయ‌న రైజింగ్ తెలంగాణ, ఫ్యూచ‌ర్ సిటీ వంటివాటిని కూడా తెర‌పైకి తెచ్చారు. 3 ట్రిలియ‌న్‌ల ఆర్థిక శ‌క్తిగా తెలంగాణ‌ను డెవ‌ల‌ప్ చేస్తామ‌ని కూడా చెబుతున్నారు. ఇది నాణేనికి ఒక‌వైపు మాత్ర‌మే. అభివృద్ధి అనేది.. అంద‌రూ స్వాగ‌తిస్తారు. కానీ, క్షేత్ర‌స్థాయిలో ఓటు బ్యాంకు రాలాలంటే.. మాత్రం.. క‌లివిడి ముఖ్యం.

నాయ‌కులు ఎవ‌రైనా.. కార్య‌క‌ర్త‌లు ఎక్క‌డైనా క‌లివిడిగా ఉంటేనే.. పార్టీ ప‌రంగా ముందుకు సాగేందుకు అవ‌కాశం ఉంటుంది. ఈ విష‌యంలో రేవంత్ చ‌ర్య‌లు ఆశించిన‌ట్టుగా లేవ‌న్న‌ది పార్టీ వ‌ర్గాల్లో జ‌రుగుతున్న చ‌ర్చ‌. ఒక‌ప్పుడు రేవంత్ రెడ్డిని స‌మ‌ర్ధించిన నాయ‌కులు కూడా.. ఇప్పుడు తెర‌మ‌రుగ‌వుతున్నారు. త‌మ అభిప్రాయాల‌ను చెబుతున్నారు. తాజాగా జీవ‌న్ రెడ్డి పార్టీని వ‌దిలి వెళ్లిపోయిన త‌ర్వాత‌.. ఆన్ లైన్ ఛానెళ్లు కొంద‌రు.. సీనియ‌ర్ల‌ను క‌లిసిన‌ప్పుడు.. రేవంత్ రెడ్డి వ్య‌వ‌హారంపై వారు సూటిగా స్పందించారు.

“పార్టీ అంటే.. రేవంత్ ఒక్క‌రే అనుకుంటున్నారు. క్షేత్ర‌స్థాయిలో కార్య‌క‌ర్త‌లు.. మండ‌ల‌స్థాయి నాయ‌కులు క‌లివిడిగా ఉంటేనే.. నాడు అధికారంలోకి వ‌చ్చాం. ఇప్పుడు ఆ ప‌రిస్థితి ఎక్క‌డుందో చెప్పండి.“ అని సీనియ‌ర్ మోస్ట్ నాయ‌కుడు ఒక‌రు వ్యాఖ్యానించారు. ఇది ఈయ‌న ఒక్క‌రి మాటే కాదు.. దాదాపు సీనియర్లుగా ఉన్న అంద‌రి మాట కూడా ఇదే. ఒక‌వైపు.. బీఆర్ ఎస్ పుంజుకునేందుకు ప్ర‌య‌త్నం చేస్తోంద‌ని.. కానీ.. కాంగ్రెస్‌లో ఒకే ఒక్క నాయ‌కుడు అన్న‌ట్టుగా రేవంత్ వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని పెద‌వి విరుస్తున్నారు.

అంద‌రినీ క‌లుపుకొని పోవ‌డంలోనూ.. అభిప్రాయ సేక‌ర‌ణ‌లోనూ ఎలాంటి ప్రాధాన్యం లేకుండా పోయింద‌ని ఆక్షేపిస్తున్నారు. “ఆయ‌న‌కు న‌చ్చిన వారిని ప‌ద‌వులు ఇచ్చారు. ఇస్తున్నారు“ అంటూ… కొంద‌రు వేం న‌రేంద్ర‌రెడ్డి వ్య‌వ‌హారాన్ని తెర‌మీదికి తెస్తున్నారు. ఇలా.. చేయ‌డం వ‌ల్ల‌.. వ‌న్ మ్యాన్ ఆర్మీగా రేవంత్‌ను మెచ్చుకునేవారికి సంతోష‌మే అయినా.. క్షేత్ర‌స్థాయిలో పార్టీ బ‌ల‌హీన ప‌డింద‌ని ఒక‌రిద్ద‌రు చెప్ప‌డం విశేషం.