తమిళుల మనసు గెలుచుకున్న బాబు

దేశంలో ఐదు రాష్ట్రాల ఎన్నికలు హోరాహోరీగా సాగుతున్నాయి. అందులో భాగంగా తమిళనాడు ఎన్నికల ప్రచారంలోకి టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సోమవారం దిగిపోయారు. సోమవారం తన 76వ జన్మదినాన్ని జరుపుకుంటున్న చంద్రబాబు… ఎన్డీఏ పెద్దల వినతి మేరకు ఉదయాన్నే జన్మదిన వేడుకలను ముగించుకున్న చంద్రబాబు నేరుగా తమిళనాడులో వాలిపోయారు. తమిళనాడులోని కోయంబత్తూరులో అడుగుపెట్టిన చంద్రబాబు అక్కడి ఓటర్లు ఎన్డీఏ వైపునకు తిరిగేలా వ్యూహాత్మక అడుగులు వేస్తున్నారు. వెరసి తమిళ ఓటర్ల మనసులను గెలుచుకుంటూ చంద్రబాబు సాగుతున్నారు.

కోయంబత్తూరులో ఎన్నికల ప్రచారం కోసం సోమవారం అక్కడికి చేరుకున్న చంద్రబాబు… తొలుత అక్కడి స్థానిక వ్యాపారులు, ప్రముఖులతో చంద్రబాబు భేటీ అయ్యారు. ఈ భేటీలో భాగంగా తమిళనాడు, ఏపీలకు ఉన్న సారూప్యతలను ప్రస్తావించిన చంద్రబాబు… ప్రాంతీయ వాదంలో తమిళులను మించిన వారు లేరని వ్యాఖ్యానించారు. అయితే డీఎంకే సర్కారు తమిళ ప్రజల మనోభావాలకు అనుగుణంగా కాకుండా తనదైన వింత శైలిలో ముందుకు సాగుతోందని ఆయన విమర్శించారు. తల్లి భాషను తమిళులు ప్రేమించినంతగా మరెవరూ ప్రేమించరని కూడా ఆయన అన్నారు. ఈ మాటలతో అక్కడి తమిళ నాయకులు ఆశ్చర్య పోయారు. చంద్రబాబు అంత హుందాగా తమిళ భాష ప్రాముఖ్యతను కొనియాడడంతో వాళ్లందరి మనసులు చంద్రబాబు దోచుకున్నారనే చెప్పాలి.

తమిళనాడుతో పాటుగా ఏపీని కలిపి ద్రవిడ ప్రాంతంగా పరిగణిస్తున్న వైనాన్ని ఈ సందర్భంగా చంద్రబాబు గుర్తు చేశారు. ఈ క్రమంలోనే ద్రవిడ సంస్కృతిని పరిరక్షించే ఉద్దేశ్యంతోనే తాను ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పంలో ద్రవిడ వర్సిటీని ఏర్పాటు చేసినట్లుగా ఆయన పేర్కొన్నారు. ఇక తమిళ, తెలుగు ప్రజల మధ్య ఉన్న అనుబంధాన్ని కూడా చంద్రబాబు గుర్తు చేశారు. తమిళ ప్రజల దాహార్తిని తీర్చేందుకే తెలుగు గంగ ప్రాజెక్టును చేపట్టినట్టుగా ఆయన పేర్కొన్నారు. నాడు ఎన్టీఆర్, ఎంజీఆర్ ల మధ్య ఉన్న స్నేహ సంబంధాలను కూడా ఈ సందర్భంగా చంద్రబాబు ప్రధానంగా ప్రస్తావించారు.

క్రమశిక్షణ, పట్టుదల, కష్టపడే తత్వం తమిళుల సొంతమని చెప్పిన చంద్రబాబు.. ఈ కారణంగానే తమిళులు అన్ని రంగాల్లో ముందు వరుసలో ఉన్నారని చెప్పారు. అయితే తమిళులు మరింత ఉన్నతిని సాధించే దిశగా డీఎంకే సర్కారు పయనించడం లేదని ఆయన ఆరోపించారు. డబుల్ ఇంజిన్ సర్కారుతో ఏం లాభమన్న విషయాన్ని తమిళ ఓటర్లు తెలుసుకోవాలన్న చంద్రబాబు… ఏపీలో 22 నెలల వ్యవధిలోనే డబుల్ ఇంజిన్ సర్కారుతో అద్భుతాలు సృష్టించామన్నారు. ప్రస్తుతం దేశంలోకి వస్తున్న విదేశీ పెట్టుటడుల్లో 25 శాతం ఏపీకే వస్తున్నాయన్న చంద్రబాబు… తమిళనాడుకూ అలాంటి పెట్టుబడులు రావాలంటే… బీజేపీ మద్దతు ఇస్తున్న అన్నాడీఎంకే కూటమికే ఓటు వేయాలని కోరారు.