బీజేపీకి బలం పెరిగితే టీడీపీని కూడా…

నియోజకవర్గాల పునర్విభజనతో పాటుగా చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లకు ఉద్దేశించిన బిల్లు లోక్ సభలో వీగిపోయిన తర్వాత ఆయా పార్టీలకు చెందిన కీలక నేతలు ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు. డీలిమిటేషన్ బిల్లుపై తనదైన శైలి గళం విప్పిన తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి… తాజాగా శనివారం సంచలన కామెంట్లు చేశారు. ప్రత్యేకించి ఎన్డీఏ రథసారథిగా ఉన్న బీజేపీ తీరుపై ఆయన గతంలో ఎన్నడూ లేని రీతిలో సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం మీడియా ప్రతినిధులతో జరిపిన చిట్ చాట్ లో భాగంగా ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ గా మారాయని చెప్పాలి.

మూడింట రెండు వంతుల మెజారిటీ ఉంది కదా అని అన్నింటినీ చట్టాలుగా చేయడం కుదరదని ఆయన అభిప్రాయపడ్డారు. మూడింట రెండు వంతుల మెజారిటీ ఉందని ప్రధాన మంత్రి పదవిలో ఉన్న నేత తనను తాను రాజుగా ప్రకటించుకోలేరు కదా అన్న రేవంత్.. ఒకవేళ అలా ప్రకటించుకుంటే దేశం చూస్తూ ఊరుకుంటుందా? అని అన్నారు.

ఈ సందర్భంగా ఏపీ రాజకీయాలను ప్రస్తావించిన రేవంత్… ఏపీలో ప్రతిపక్షానికి ఉన్నది 11 సీట్లేనని ఆయన గుర్తు చేశారు. అలాగని సీఎంగా ఉన్న చంద్రబాబు తనను తాను రాజుగా ప్రకటించుకుంటే ఒప్పుకుంటారా? అని ఆయన ప్రశ్నించారు. డిక్టేటర్ షిప్ ను ఏ ఒక్కరూ ఒప్పుకునే పరిస్థితి లేదని రేవంత్ అన్నారు.

ఇక బీజేపీ తన మిత్రపక్షాల పట్ల ఏ రీతిన వ్యవహరిస్తుందన్న విషయాన్ని ప్రస్తావించిన రేవంత్ రెడ్డి… బీజేపీతో పొత్తు పెట్టుకున్న పార్టీలకు మనుగడ ఉండదని తేల్చి పారేశారు. తాను చేసిన ఈ కామెంట్ నిజమేనని చెప్పేందుకు ఆయన పలు ఉదాహరణలు చెప్పారు.

అందులో భాగంగా బీహార్ రాజకీయాలను ప్రస్తావించిన రేవంత్… ఆ రాష్ట్ర సీఎంగా ఉన్న నితీశ్ కుమార్ పరిస్థితి ఏమైందో తెలుసు కదా అని ఆయన అన్నారు. ఇక మహారాష్ట్రలో ఏక్ నాథ్ షిండే పరిస్థితి కూడా తెలిసిందే కదా అని ఆయన వ్యాఖ్యానించారు. బీజేపీతో ప్రస్తుతం పొత్తులో ఉన్న టీడీపీ, ఆ పార్టీ అధినేత చంద్రబాబు పరిస్థితి కూడా అందుకు భిన్నంగా ఏమీ ఉండదన్నారు.

కేంద్రంలో బీజేపీకి తక్కువ సీట్లు ఉన్న విషయాన్ని ప్రస్తావించిన రేవంత్ రెడ్డి… టీడీపీ మద్దతు అవసరం కాబట్టే ఆ పార్టీకి బీజేపీ అధిక ప్రాధాన్యం ఇస్తోందని అన్నారు. అయితే ఎప్పుడూ ఇదే పరిస్థితి ఉండదు కదా అని కూడా ఆయన వ్యాఖ్యానించారు.

భవిష్యత్తులో బీజేపీ బలం పెరిగితే… టీడీపీని బీజేపీ పక్కనపెట్టేయడం ఖాయమని ఆయన అన్నారు. ఇక లోక్ సభ అయినా, రాజ్యసభ అయినా చట్టాలు చేసేందుకే ఉన్నాయన్న రేవంత్ రెడ్డి… ఆ రెండు సభలు చేసే చట్టాలను అమలు చేయాల్సింది మాత్రం రాష్ట్రాలేనన్న విషయాన్ని బీజేపీ గుర్తుంచుకోవాలన్నారు. 2011 జనాభా లెక్కల ఆధారంగానే మహిళా రిజర్వేషన్లను అమలు చేయాలని రేవంత్ డిమాండ్ చేశారు.