ఎన్డీఏ నేతల బ్రేక్‌ఫాస్ట్ సమావేశానికి రేవంత్

దేశ రాజధాని ఢిల్లీలో రాజకీయంగా ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్డీఏ నేతల బ్రేక్‌ఫాస్ట్ సమావేశానికి హాజరవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కేంద్ర మంత్రి భూపతి రాజు శ్రీనివాస్ ఏర్పాటు చేసిన విందుకు ఆయన హాజరయ్యారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ బీజేపీ ఎంపీ కె. లక్ష్మణ్, కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, కుమారస్వామి, పెమ్మసాని చంద్రశేఖర్, టీడీపీ ఎంపీలు, ఏపీ మంత్రి పయ్యావుల కేశవ్, డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి ఎన్డీఏ నేతలతో సన్నిహితంగా కనిపించడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. తెలుగు రాష్ట్రాలకు చెందిన బీజేపీ, టీడీపీ నేతలతో ఆయన సరదాగా ముచ్చటించడం, కలసి గడపడం ప్రత్యేకంగా చర్చకు దారి తీసింది.

ఇక, టీడీపీ నేతల ఆహ్వానం మేరకే ఈ సమావేశానికి రేవంత్ రెడ్డి హాజరయ్యారని సమాచారం. సాధారణంగా విభిన్న రాజకీయ పక్షాలకు చెందిన నాయకులు ఒకే వేదికపై కలుసుకోవడం అరుదుగా ఉండటంతో, ఈ సమావేశం ప్రాధాన్యత మరింత పెరిగింది. నిన్న పార్లమెంట్‌లో కీలకమైన 131వ సవరణ బిల్లు వీగిపోవడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన వేళ, ఈ బ్రేక్‌ఫాస్ట్ సమావేశం జరగడం మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది.