‘ఉత్తరాది’పై ‘దక్షిణాది’దే విజయం!

డీలిమిటేషన్, చట్టసభల్లో మహిళా రిజర్వేషన్లకు సంబంధించిన బిల్లులు లోక్ సభలో వీగిపోయిన నేపథ్యంలో ఆసక్తికర విశ్లేషణలు సాగుతున్నాయి. ఆ విశ్లేషణలన్నింటిలో ఒకటి మాత్రం యావత్తు దేశాన్ని తట్టి లేపిందన్న వాదనలు వినిపిస్తున్నాయి. అదేంటంటే… ఉత్తరాది ప్రాధాన్యాన్ని మరింతగా పెంచుతూ దక్షిణాది ప్రాధాన్యాన్ని తగ్గించే దిశగా జరుగుతున్న ఎన్డీఏ ఎత్తులన్నీ చిత్తు అయ్యాయయన్నదే ఆ విశ్లేషణ సారాంశం. మరింత సూటిగా చెప్పాలంటే.. ఉత్తరాది లాబీపై దక్షిణాది లాబీ విజయం సాధించింది.

దేశవ్యాప్తంగా నియోజకవర్గాల పునర్విభజన చేపట్టాలన్న ఎన్డీఏ ఆలోచనతో ఒక్కసారిగా పెద్ద చర్చకే తెర లేసింది. జనాభా ప్రాతిపదికగా జరిగే డీలిమిటేషన్ తో దక్షిణాదిలో లోక్ సభ స్థానాల సంఖ్య తగ్గిపోతుందని, అదే సమయంలో ఇప్పటికే అధిక సంఖ్యలో ఉన్న ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన లోక్ సభ సీట్ల సంఖ్య మరింగా పెరుగుతందన్న ఆందోళన మొదలైంది. ఇదే జరిగితే… కేంద్రంలో అధికార పగ్గాలు చేజిక్కించుకునే పార్టీలు ఇకపై దక్షిణాది రాష్ట్రాల్లోని లోక్ సభ సీట్లతో సంబందం లేకుండానే తమ పని ముగించుకుంటాయన్న వాదనా వినిపించింది. వెరసి దక్షిణాది రాష్ట్రాలకు అసలేమీ ప్రాధాన్యం దక్కదని, నిధుల విడుదలలో భారీ అంతరం చోటుచేసుకునే ప్రమాదం లేకపోలేదని నిపుణులు విశ్లేషించారు.

ఇదే వాదనతో సాగిన తమిళనాడులోని అధికార పార్టీ డీఎంకే… తొలిసారిగా దక్షిణాది రాష్ట్రాలకు చెందిన పార్టీలతో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయగా.. ఏపీలోని అధికార, విపక్షాలకు చెందిన పార్టీలు తప్పించి మిగిలిన నాలుగు రాష్ట్రాల పార్టీలు ఈ సమావేశానికి హాజరయ్యారు. జనాభా లెక్కల ఆధారంగా చేపట్టే డీలిమిటేషన్ ను వ్యతిరేకించి తీరాలని సదరు సమావేశం తీర్మానించింది. ఇదే వాదనతో సాగిన ఆయా పార్టీలు తాము భాగస్వామ్యం ఉన్న ఇండియా కూటమిలోని పార్టలకు తమ వాదనను వినిపించాయి. ఈ క్రమంలో జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ తో పాటు దేశంలో కీలక పార్టీగా ఉన్న సమాజ్ వాదీ పార్టీ సహా చాలా పార్టీలు జనాభా లెక్కల ఆధారంగా జరిగే డీలిమిటేషన్ ను వ్యతిరేకించాలని తీర్మానించాయి.

గురు, శుక్రవారాల్లో జరిగిన చర్చల్లో ఆయా పార్టీలకు చెందిన ఎంపీలు దక్షిణాది రాష్ట్రాలతో పాటు ఈశాన్య రాష్ట్రాలకూ తీరని నష్టం జరుగుతుందన్న వాదనను వినిపించారు. ఈ క్రమంలో విపక్షాల్లోని దక్షిణాది భయాందోళనలను పరిష్కరించే దిశగా ఎన్డీఏ కూటమి… జనాభా లెక్కల ఆధారంగా డీలిమిటేషన్ ను చేయడం లేదని చెప్పింది. అంతేకాకుండా అన్ని రాష్ట్రాల్లో ఆయా రాష్ట్రాల్లోని ప్రస్తుత లోక్ సభ స్థానాలకు అదనంగా 50 శాతం సీట్లు పెరిగేలా చర్యలు తీసుకుంటామని చెప్పింది. అయితే ఆ విషయాన్ని మాటమాత్రంగా కాకుండా బిల్లులో లిఖితపూర్వకంగా చేపట్టాలని విపక్షాలు కోరాయి. 

ఆ తర్వాత జరిగిన ఓటింగ్ లో విపక్షాలకు చెందిన సభ్యులు బిల్లుకు వ్యతిరేకంగా ఓటేశారు. అధికార పక్ష సభ్యులు బిల్లుకు అనుకూలంగా ఓటేసినా… మూడొంతుల్లో రెండు వంతుల మెజారిటీ దక్కకపోవడంతో బిల్లు వీగిపోయింది. బిల్లు వీగిపోయిన వెంటనే దక్షిణాది రాష్ట్రాలైన తమిళనాడు, తెలంగాణ సీఎంలు ఎంకే స్టాలిన్, ఎనుముల రేవంత్ రెడ్డిలు హర్షం ప్రకటించారు. వెరసి ఉత్తరాది వాదనపై దక్షిణాది విజయం సాధించిందన్న విశ్లేషణలు ఆసక్తి రేకెత్తించాయి.