రేప్ చేసి.. కదులుతున్న రైల్లో నుంచి తోసేశారు

మరో దారుణం వెలుగు చూసింది. పాతికేళ్ల యువతిని దారుణంగా రేప్ చేసి.. కదులుతున్న రైల్లో నుంచి తోసేసిన షాకింగ్ ఉదంతం బయటకు వచ్చింది. మహారాష్ట్రంలోని నవీ ముంబయిలో చోటు చేసుకున్న ఈ ఆరాచక ఘటన సంచలనంగా మారింది. వశీ రైల్వే బ్రిడ్జ్ దగ్గర అపస్మారక స్థితిలో ఉన్న ఆమె ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. అయితే.. ఆమె ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు చెబుతున్నారు.

టిట్వాలాకు చెందిన పాతికేళ్ల యువతి.. పొవైలో ఇంటిపనులు చేస్తుంటుంది. తల్లిదండ్రుల్ని చూసేందుకు వారానికి ఒకసారి ఇంటికి వెళ్లి వస్తుండటం అలవాటు. ఎప్పటిలానే గతశనివారం ఇంటికి వెళ్లిన ఆమె ఆదివారం సాయంత్రం తిరిగి పొవైకి బయలుదేరింది. అయితే.. అప్పటి నుంచి ఇంట్లోని వారికి అందుబాటులో లేదు. ఇదిలా ఉంటే.. తాజాగా ఆమెను అపస్మారక స్థితిలో వశీ రైల్వే బ్రిడ్జి పైన పడి ఉంది. దీన్ని గుర్తించిన వారు.. స్థానిక రైల్వే అధికారులకు సమాచారం అందించారు.

దీంతో.. ఆ యువతిని జేజే ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్తితి నిలకడగానే ఉన్నా.. మాట్లాడలేని పరిస్థితి ఉందని చెబుతున్నారు. ఆమె నోరు విప్పితేనే.. అసలేం జరిగిందన్న విషయంపై అవగాహన వస్తుందని చెబుతున్నారు. వైద్య నివేదికల ప్రకారం ఆమెపై అత్యారచారం జరిగినట్లుగా చెబుతున్నారు. అనంతరం కదులుతున్న రైల్లో నుంచి తోసివేయటంతో తీవ్ర గాయాలపాలైంది. ఆమె నోరు విప్పితే.. రానున్న రోజుల్లో మరెన్ని సంచలనాలకు తెర తీసే వీలుందని అంచనా వేస్తున్నారు.