తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీని ప్రక్షాళన చేసే దిశగా అడుగులు పడుతున్నాయి. పార్టీలో సంస్థాగతంగా పనిచేస్తున్న వారిని గత పది సంవత్సరాల కాలంలో పక్కన పెట్టారు. ముఖ్యంగా ఉద్యమ సమయంలో పార్టీకి అండదండగా ఉన్న కార్యకర్తలను, క్షేత్రస్థాయి నాయకులను కూడా విస్మరించారు… అన్న వాదన బలంగా వినిపించింది. ఫలితంగా గత ఎన్నికల సమయంలో ఈ వాదన బలంగా పనిచేసింది. ఇప్పుడు కూడా అదే అసంతృప్తి పార్టీ నాయకులు కార్యకర్తలలో కనిపిస్తోంది.
దీనిని ఎంత మేరకు తగ్గించుకుంటే అంత మంచిదన్న ధోరణి బీఆర్ ఎస్ పార్టీలో కనిపిస్తోంది. ఈ క్రమంలో పార్టీని పూర్తిగా ప్రక్షాళన చేసే దిశగా అడుగులు పడుతున్నాయి. అదే సమయంలో క్షేత్రస్థాయి నాయకులకు ముఖ్యంగా జిల్లా స్థాయి నాయకులకు రాష్ట్రస్థాయిలో, మండల స్థాయి నాయకులకు జిల్లా స్థాయిలో పదవులు ఇచ్చే దిశగా పార్టీ ఆలోచన చేస్తోంది. వచ్చే ఎన్నికల సమయానికి పోటీ తీవ్రంగా ఉండడంతో పాటు కెసిఆర్ కుమార్తె కవిత యాంటీగా మారిన నేపథ్యంలో ఆమె దూకుడు కూడా ఎక్కువగా ఉంటుందన్న చర్చ నడుస్తోంది.
ఈ క్రమంలో పార్టీని ప్రక్షాళన చేయడంతో పాటు ఆది నుంచి పార్టీలో జెండా మోసిన వారికి పార్టీని నమ్ముకున్న వారికి ప్రాధాన్యం ఇవ్వాలని భావిస్తున్నారు. నిజానికి కెసిఆర్ హయాంలో ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి ఉన్న గుర్తింపు పార్టీలో ఉన్న వారికి లేకుండా పోయింది అన్న వాదన బలంగా వినిపించింది. జెండా మోసి, ఉద్యమ సమయంలో నిరసన వ్యక్తం చేసి రాష్ట్ర సాధన కోసం కృషి చేసిన వారిని పక్కన పెట్టారన్న చర్చ కూడా నడిచింది. ఇది తీవ్ర అసంతృప్తికి దారి తీసింది.
అదేవిధంగా కుటుంబ పాలన ముద్ర కూడా కేసీఆర్ పై పడింది. ఇక అవినీతి ఆరోపణలు, ఇతర అంశాలు కూడా ప్రభావం చూపించాయి. ఈ క్రమంలో ఇప్పటికైనా పార్టీని ప్రక్షాళన చేయకపోతే కవితతో పాటు ప్రస్తుత ప్రభుత్వ ప్రభావాన్ని కూడా ఎదుర్కొనలేని పరిస్థితి ఏర్పడినా ఆశ్చర్యం లేదన్న బలమైన చర్చ నడుస్తోంది. దీనిని దృష్టిలో పెట్టుకొని బీఆర్ఎస్ పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేయాలనేది పార్టీ తీసుకున్న నిర్ణయం అని తెలుస్తోంది.
ఈ క్రమంలోని మండల, జిల్లా స్థాయిలో నాయకత్వం మార్పు దిశగా త్వరలోనే నిర్ణయం తీసుకుంటారని సమాచారం. తద్వారా వచ్చే ఎన్నికల నాటికి పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేదిశగా అడుగులు పడుతున్నాయి. మరి ఇది ఏ మేరకు సక్సెస్ అవుతుందనేది చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates