వెయ్యి కోట్ల ఒప్పందం… ముస్లిం ఓట్ల కోస‌మేనా?

దేశవ్యాప్తంగా మరో రెండు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. వీటిలో ప్రధానంగా బిజెపి ఎక్కువగా ఆశలు పెట్టుకున్న రాష్ట్రం పశ్చిమబెంగాల్. దాదాపు 15 సంవత్సరాలుగా ఇక్కడ మమతా బెనర్జీ పాలన సాగిస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ సహా వామపక్షాలు బలహీనంగా ఉన్నాయి. దీనితో ఇక్కడ పాగా వేయాలన్నది బిజెపి నాయకులు పెట్టుకున్న భారీ లక్ష్యం. అందుకే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నుంచి బిజెపి అగ్ర నేతల వరకు కూడా పశ్చిమబెంగాల్లో పాగావేసి మరి ప్రచారం చేస్తున్నారు.

అయితే అధికారం ఎవరికి దక్కుతుంది.. దక్కదు.. అనే విషయాలను పక్కన పెడితే.. తాజాగా వెలుగు చూసిన ఒక కీలక సంఘటన బిజెపికి మైనస్ గా మారింది. “ముస్లిం మైనారిటీ ఓట్లను చేల్చేందుకు బిజెపి చేసిన ప్రయత్నం ఇదీ“ అంటూ సీఎం మమతా బెనర్జీ స్వయంగా ఓ స్టింగ్ ఆప‌రేష‌న్‌కు సంబంధించిన‌ వీడియోను విడుదల చేశారు. ఇది తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. ఈ వీడియోలో ముస్లిం మైనారిటీలు అధికంగా ఉన్న నియోజకవర్గాల్లో వారి ఓట్లను కొనుగోలు చేసేందుకు దాదాపు 1000 కోట్ల రూపాయలు ఒప్పందం జరిగిందన్నది మమతా బెనర్జీ చేస్తున్న ఆరోపణ.

దీనికి సంబంధించి ఒక వీడియోను సైతం ఆమె పోస్ట్ చేశారు. ఈ వీడియోలో తృణమూల్ కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే ప్రస్తుతం సొంత పార్టీ పెట్టుకుని.. మైనారిటీ వర్గాలు ఎక్కువగా ఉన్న నియోజకవర్గంలో రాజకీయం చేస్తున్న హుమాయున్ కబీర్ బిజెపి నాయకులతో చర్చిస్తున్నట్టుగా ఉంది. సుదీర్ఘ కాలం పాటు టీఎంసీ నాయకుడిగా ఉన్న కబీర్.. బెనర్జీతో విభేదించి `ఆమ్‌ జనతా పార్టీ`ని పెట్టుకున్నారు. ఇప్పుడు అదే పార్టీ బిజెపితో చేతులు కలిపిందని మమతా బెనర్జీ ఆరోపిస్తున్నారు.

ఈ క్రమంలో దాదాపు 1,000 కోట్ల రూపాయలు మేరకు ఇరుపాక్షాల మధ్య ఒప్పందం జరిగిందని సదరు వీడియోలో ఉన్నట్టు చెబుతున్నారు. తద్వారా మైనారిటీ నియోజకవర్గాల్లో ఓట్లను చీల్చేందుకు అదేవిధంగా మైనారిటీ ఓట్లను కొనుగోలు చేసేందుకు కబీర్ బిజెపికి సహకరిస్తున్నారని మమత చెబుతున్నారు. బిజెపి అధికారంలోకి వస్తే కబీర్ కు ఉపముఖ్యమంత్రి పదవితో పాటు కీలకమైన శాఖలను కూడా అప్పగించాలన్న ఒప్పందం జరిగిందని మమత ఆరోపించారు.

దీనికి సంబంధించిన ఒక స్టింగ్ ఆపరేషన్ వీడియోను ఆమె విడుదల చేశారు. అయితే ఈ వీడియోలో ముస్లింలను కబీర్ అవమానిస్తున్నారన్న వ్యాఖ్యలు కూడా వినిపించటం రాజకీయంగా తీవ్ర సంచలనంగా మారింది. ముస్లింల కోసం తనేమీ కంకణం కట్టుకోలేదని, రాజకీయాలను రాజకీయంగానే చూస్తానని కబీర్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. డబ్బుకు ఏదైనా సాధ్యమవుతుందని చేసిన కామెంట్లు ఇప్పుడు వైరల్ గా మారాయి.  

మొత్తంగా 1000 కోట్ల రూపాయల ఒప్పందం జరిగిందనే విషయం కూడా స్టింగ్‌ ఆపరేషన్ చేసిన వీడియోలో వినిపించటం రాజకీయంగా తీవ్ర వివాదానికి దారి తీసింది. మరో 10 రోజుల్లో అసెంబ్లీ తొలి దశ ఎన్నికల జరుగుతున్న బెంగాల్లో ఈ వీడియో తమకు లాభరిస్తుందని మమతా బెనర్జీ అంచనా వేసుకుంటున్నారు. అయితే.. ఇది ఏఐ వీడియో అని క‌బీర్ చెబుతున్నా.. ముస్లింలు మాత్రం న‌మ్మ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం.