నందమూరి అభిమానుల ఎదురు చూపులను రెన్యూవల్ చేయడమే తప్ప ఎంట్రీ ఎప్పుడు ఇస్తాడో చెప్పకుండా దోబూచులాడుతున్న మోక్షజ్ఞ మరోసారి వార్తల్లోకి వస్తున్నాడు. తన డెబ్యూ గురించి కనీసం ఏడాదికి ఒకసారైనా ఏదో ఒక న్యూస్ చక్కర్లు కొట్టడం, తీరా అది ఏదో ఒక కారణం వల్ల నిజం కాకపోవడం రిపీటవుతూనే ఉంది. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ఫాంటసీ మూవీకి అన్ని సిద్ధం చేసుకుని చివరి స్టేజిలో ఆగిపోవడం తెలిసిందే. ఇది జరిగి ఏడాది దాటిపోయి గతంగా మారింది.
ఇప్పుడు కొత్తగా వసిష్ఠ దర్శకత్వంలో మోక్షజ్ఞ ఎంట్రీకి రంగం సిద్ధమయ్యిందనే కొత్త ప్రచారం ఊపందుకుంది. నిజానికి తనకు సంబంధించి ఏ అప్డేట్ అయినా బాలయ్య స్వయంగా చెబితే తప్ప నమ్మలేని స్థితి నెలకొంది. ఎందుకంటే గతంలో చాలాసార్లు ఈ ప్రస్తావన వచ్చినప్పుడు బాలకృష్ణ రెండు మూడు ప్రతిపాదనలు చెప్పారు. వాటిలో ఆదిత్య 369 సీక్వెల్ ఆదిత్య 999 మ్యాక్స్ ఒకటి. తన క్లాసిక్ మూవీకి కొనసాగింపుగా భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తామని ఎప్పుడో చెప్పారు.
కానీ ఇప్పటికీ అది కార్యరూపం దాల్చలేదు. క్రిష్ కి దర్శకత్వ బాధ్యతలు ఇస్తారనే ప్రచారం జరిగినా ఘాటీ ఫలితం తర్వాత అవి ఆగిపోయాయి. మోక్షజ్ఞ ఆల్రెడీ మూడు పదుల వయసు దాటేశాడు. ఇప్పుడున్న స్టార్లందరూ పాతిక లేదా అంతలోపే ఎంట్రీ ఇచ్చిన వాళ్ళు. సో ఇప్పటికైనా మించిపోయింది లేదు. దర్శకుడు వసిష్ఠనా లేక వేరొకరా అనేది వీలైనంత త్వరగా సెట్ చేసుకుని కెరీర్ మొదలు పెడితే రెండు మూడేళ్ళలో సెటిలవ్వొచ్చు.
ఎలాగూ ఫ్యాన్స్ అండదండలు ఉంటాయి కాబట్టి సబ్జెక్టు సెలక్షన్ లో సరిగ్గా అడుగులు వేస్తే అఖిల్ కు వచ్చిన ఇబ్బందులు తలెత్తవు. ఇంకోవైపు మోక్షజ్ఞ పూర్తి సన్నద్ధంగా లేడని ఒక ప్రచారం ఎప్పటి నుంచో జరుగుతూనే ఉంది. ఈ మధ్య ఫంక్షన్లకు వచ్చిన లుక్స్ చూస్తే బాగానే కనిపించాడు. వీలైనంత త్వరగా హీరో అయిపోతే ఆ తర్వాత మోక్షజ్ఞకు పెళ్లి చేయాల్సిన మహత్తర బాధ్యత బాలయ్య భుజాల మీద ఉంటుంది. ఈ రెండే ఆయన ప్రధానంగా తీర్చుకోవాల్సిన బాధ్యతలు.
Gulte Telugu Telugu Political and Movie News Updates