ఆంధ్రప్రదేశ్లో మున్సిపల్ ఎన్నికల దిశగా ప్రభుత్వం వేగంగా కసరత్తు ప్రారంభించింది. అమరావతిలో జరిగిన కేబినెట్ సమావేశంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంత్రులతో ప్రత్యేకంగా చర్చించి, మరో మూడు నుంచి నాలుగు నెలల్లో ఎన్నికలు నిర్వహించేలా సిద్ధం కావాలని సూచించారు.
ఎన్నికల కమిషన్తో సమన్వయం, ఓటరు జాబితాల సవరణ, వార్డుల పునర్విభజన వంటి అంశాలపై వేగం పెంచాలని ఆదేశించారు. కొత్త జనగణన పూర్తి కాకపోవడంతో 2011 జనాభా లెక్కల ఆధారంగానే ఎన్నికలు నిర్వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
స్థానిక సంస్థల ఎన్నికలు ప్రభుత్వ పనితీరుకు అద్దం పట్టే సందర్భమని పేర్కొన్న సీఎం, అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయాలని స్పష్టం చేశారు. పట్టణ ప్రాంతాల్లో రహదారులు, డ్రైనేజీ, తాగునీటి సరఫరా వంటి మౌలిక వసతుల మెరుగుదలపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు సూచించారు. పారదర్శకంగా, వివాదరహితంగా ఎన్నికలు నిర్వహించేందుకు సాంకేతిక వినియోగం పెంచాలని, పరిపాలనా వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని నిర్ణయించారు.
రాష్ట్రంలో ప్రస్తుతం మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు, మున్సిపల్ కార్పొరేషన్ల గడువు ముగియడంతో ప్రత్యేకాధికారుల పాలన కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఎన్నికలు నిర్వహించడం రాజకీయంగా కూడా కీలకంగా మారింది. అధికార పార్టీ అభివృద్ధి అజెండాతో ముందుకు సాగుతుండగా, ప్రతిపక్షాలు తమ వ్యూహాలను పదునుపెడుతున్నాయి. రాబోయే మున్సిపల్ ఎన్నికలు రాష్ట్ర రాజకీయ దిశను నిర్ణయించే కీలక పరీక్షగా నిలవనున్నాయి.
Gulte Telugu Telugu Political and Movie News Updates