కమ్యూనిస్టుల మనసు దోచుకున్న కవిత

దేశంలోని ఓ ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగుతోంది. అందులో కమ్యూనిస్టు పాలనలో ఉన్న కేరళలోనూ ఎన్నికలు జరుగుతున్నాయి. ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ తరఫున ప్రచారం చేసేందుకు పార్టీ స్టార్ క్యాంపెయినర్ హోదాలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సుడిగాలి పర్యటన సాగిస్తున్నారు. ఇలాంటి తరుణంలో కమ్యూనిస్టులకు బూస్టింగ్ ఇవ్వడమే కాకుండా కాంగ్రెస్ కు ఓటు వేయొద్దంటూ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఓ వీడియోను విడుదల చేశారు. ఈ వీడియోతో నిజంగానే కమ్యూనిస్టుల మనసును కవిత చూరగొన్నారని చెప్పక తప్పదు. 

2.07 నిమిషాల నిడివి ఉన్న ఈ వీడియోను కమ్యూనిస్టులు కేరళలో సరిగ్గా వాడుకుంటే… వారికి మంచి బూస్టు వచ్చి తీరుతుందన్న వాదనలు అయితే బలంగా వినిపిస్తున్నాయి. ఈ వీడియోలో కాంగ్రెస్ తో పాటు ఆ పార్టీ నేతగా వెళ్లిన రేవంత్ రెడ్డి తీరును ఎండగడుతూ కవిత సంచలన ఆరోపణలు చేశారు. తెలంగాణ ప్రజలను నిలువునా మోసం చేసిన కాంగ్రెస్ సార్టీ ఇప్పుడు కేరళ ప్రజలనూ మోసగించేందుకు సిద్ధపడిందని ఆమె ఆరోపించారు. ఆరు గ్యారెంటీలు అంటూ తెలంగాణ జనాన్ని మభ్యపెట్టిన రేవంత్… కేరళ ప్రజలనూ మాయ చేసేందుకు యత్నిస్తున్నారని విమర్శించారు.

2023 ఎన్నికల సందర్భంగా తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డిలు ఆరు గ్యారెంటీలు అంటూ హామీల వర్షం కురిపించారని కవిత ఆరోపించారు. అయితే వాటిలో కేవలం ఒక్క హామీని అమలు చేసి మిగిలిన వాటిని మూలన పడేశారన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం మినహా తెలంగాణలో కాంగ్రెస్ సర్కారు ప్రజలకు చేసిందేమీ లేదని ధ్వజమెత్తారు. తెలంగాణను కాంగ్రెస్ పార్టీ తన ఏటీఎంలా వాడుకుంటోందని ఆమె ఆరోపించారు.

తెలంగాణలో ప్రజల నుంచి దోచిన సొమ్మును రేవంత్ కాంగ్రెస్ అధిష్ఠానానికి అందిస్తున్నారని కవిత ఆరోపించారు. కేరళలోనూ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ దోపిడీ సొమ్మునే ఖర్చు చేస్తోందని ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రజలు మోసపోయినట్లుగా మీరూ మోసపోవద్దంటూ ఆమె కేరళ ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రస్తుతం కేరళలో విజయన్ పాలన బాగుందని, ఆ పాలన మరింత కాలం పాటు కొనసాగేందుకు ఆ రాష్ట్ర ప్రజలు సహకరించాలని ఆమె పిలుపునిచ్చారు. కవిత నోట నుంచి వచ్చిన ఈ పిలుపు నిజంగానే లెఫ్ట్ నేతలను ఉత్తేజితులను చేసిందని చెప్పాలి.