ఈసీని విపక్షాలు ఏం చెయ్యలేవా?

కేంద్ర ఎన్నిక‌ల సంఘం ప్ర‌ధాన క‌మిష‌న‌ర్.. జ్ఞానేష్ కుమార్ సేఫ్ అయ్యారు. ఆయ‌న‌పై కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని విప‌క్షాలు ఇచ్చిన అభిశంస‌న తీర్మాల‌ను పార్ల‌మెంటు ఉభ‌య స‌భ‌లు తోసిపుచ్చాయి. దీంతో ఆయ‌న‌పై ఎలాంటి అభిశంస‌న తీర్మానం ఉండ‌దు. పైగా.. రాజ్య‌స‌భ చైర్మ‌న్ దీనిపై కామెంటు చేయ‌డం కూడా ప్రాధాన్యం సంత‌రించుకుంది. ఈ తీర్మానానికి `వాల్యూ` లేద‌ని ఆయ‌న పేర్కొన్నారు. అయితే.. ఈ మేర‌కు సోమ‌వారం రాత్రి 10 గంట‌ల త‌ర్వాత‌.. రాజ్య‌స‌భ స‌చివాల‌యం ప్ర‌క‌టించ‌డం మ‌రింత ప్రాధాన్యం సంత‌రించుకుంది. ఇక‌, లోక్‌స‌భ గ‌తంలోనే తీర్మానాన్ని తోసిపుచ్చింది.

ఏం జ‌రిగింది?

దేశ‌వ్యాప్తంగా ఓట‌ర్ల జాబితాను స‌వ‌రించే ప్ర‌క్రియ చేప‌ట్టిన కేంద్ర ఎన్నిక‌ల సంఘం.. అనేక అవ‌క‌త‌వ‌క‌ల‌కు పాల్ప‌డింద‌ని విప‌క్షాలు ఆరోపించాయి. వాస్త‌వానికి స్పెష‌ల్‌ ఇంటెన్సివ్ రివిజ‌న్ (స‌ర్‌)ను కేంద్ర ఎన్నిక‌ల సంఘం ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకుంది. దాదాపు 50 ఏళ్ల త‌ర్వాత‌.. దీనిని చేప‌ట్టిన‌ట్టు కూడా పేర్కొంది. తొలుత బీహార్‌లో దీనిని చేప‌ట్టారు. అయితే.. ఇది అధికార పార్టీ బీజేపీకి అనుకూలంగా ప్ర‌తిప‌క్షాల‌కు వ్య‌తిరేకంగా చేప‌ట్టారంటూ..కాంగ్రెస్ పార్టీ అగ్ర‌నేత రాహుల్‌గాంధీ విమ‌ర్శించారు. ఆ త‌ర్వాత‌.. ఆయన అదే రాష్ట్రంలో `ఓట్ అధికార్ యాత్ర‌` పేరుతో పెద్ద యాత్ర కూడా చేప‌ట్టారు.

ఇక‌, ఆ త‌ర్వాత క‌ర్ణాట‌క‌లో జ‌రిగిన ఎన్నిక‌ల్లోనూ అవ‌క‌త‌వ‌క‌లు జ‌రిగాయ‌ని.. ఒకే డోర్ నెంబ‌రుతో వేలాది ఓట్లు ఇచ్చార‌ని.. చ‌నిపోయిన వారిని కూడా బ‌తికిఉన్న‌ట్టు, బ‌తికి ఉన్న‌వారిని సైతం చ‌నిపోయార‌ని పేర్కొంటూ.. ఓట్లు తీసేసి..ఇచ్చే కార్య‌క్ర‌మం చేప‌ట్టార‌ని కూడా ఆరోపించారు. ఈ క్ర‌మంలో ప‌శ్చిమ బెంగాల్‌, త‌మిళ‌నాడు స‌హా ప‌లు రాష్ట్రాల్లో కేంద్ర ఎన్నిక‌ల సంఘానికి వ్య‌తిరేకంగా పెద్ద ఎత్తున ఉద్య‌మం కూడా చేప‌ట్టారు. ఈ క్ర‌మంలో కేంద్ర ఎన్నిక‌ల సంఘం ప్ర‌ధాన క‌మిష‌న‌ర్ జ్ఞానేష్‌కుమార్ కేంద్రంగా దాదాపు 8 విప‌క్ష పాలిత రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు కూడా దండెత్తారు. ఇలా.. మొద‌లైన ఉద్య‌మం ఆయ‌నను ఆ ప‌ద‌వి నుంచి దించేయాల‌న్న డిమాండ్ కు దారి తీసింది.

130 మంది సంత‌కాల‌తో..

జ్ఞానేష్ కుమార్‌ను అభిశంసించాలంటే.. సుప్రీంకోర్టు న్యాయ‌మూర్తిని అభిశంసించే ప్రక్రియ‌కు స‌రిస‌మాన‌మైన విధానాన్నే అనుస‌రించాలి. ఈ క్ర‌మంలో పార్ల‌మెంటు ఉభ‌య స‌భ‌ల్లోనూ తీర్మానం ప్ర‌వేశ పెట్టి.. దీనిపై చ‌ర్చ చేప‌ట్టాలి. ముందుగా ఈ తీర్మానాన్ని బ‌ల‌ప‌రుస్తూ.. ఆయా స‌భ‌ల్లోని స‌భ్యులు తీర్మాన ప్ర‌తుల‌పై సంత‌కాలు చేయాలి.

ఇలా లోక్‌స‌భ‌లో 130 మంది స‌భ్యులు సంత‌కాలు చేశారు. రాజ్య‌స‌భ‌లో 63 మంది స‌భ్యులు సంత‌కాలు చేశారు. వీటిపై చ‌ర్చ చేప‌ట్టాల‌ని తాజాగా వాయిదా ప‌డిన బ‌డ్జెట్ స‌మావేశాల్లోనే ప‌ట్టుబ‌ట్టారు. కానీ, అటు లోక్‌స‌భ‌, ఇటు రాజ్య‌స‌భ కూడా తీర్మానాల‌ను ర‌ద్దు చేశాయి. అయితే.. దీనికికార‌ణాలు చెప్ప‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. ఏదేమైనా జ్ఞానేష్‌కుమార్ ప్ర‌స్తుతానికి సేఫ్ అయిపోయారు.