ఈసారి అమరావతి లక్ష్యం… గురి తప్పకూడదు!

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తికి చ‌ట్ట‌బ‌ద్ద‌త క‌ల్పించే బిల్లుకు పార్ల‌మెంటు ఉభ‌య స‌భ‌లు ఆమోదం తెలిపిన నేప‌థ్యంలో ఇక రాష్ట్ర‌ప‌తి ఆమోద‌మే మిగిలి ఉంది. ఇది కూడా త్వ‌ర‌లోనే పూర్త‌వుతుంద‌ని సీఎం చంద్ర‌బాబు భావిస్తున్నారు. అయితే.. ఎలానూ చ‌ట్ట‌బ ద్ద‌త వ‌చ్చేసిన‌ట్టే కాబ‌ట్టి.. రాజ‌ధాని ప‌నుల‌ను నిర్దేశిత గ‌డువులోగా పూర్తి చేయాల‌ని ఆయ‌న ఆదేశించారు. తాజాగా శ‌నివారం సాయంతం అమ‌రావ‌తి ప‌నుల‌పై చంద్ర‌బాబు కీల‌క స‌మావేశం నిర్వ‌హించారు. అమ‌రావ‌తి నిర్మాణం ఇక ఎట్టి ప‌రిస్థితిలోనూ ఆల‌స్యం కావ‌డానికి వీల్లేద‌ని తేల్చి చెప్పారు.

దీనికి సంబందించి ఇప్ప‌టి వ‌ర‌కు వారం-నెల అన్న‌ట్టుగా విధించుకున్న ల‌క్ష్యాల‌ను ఇక‌పై `రోజు-వారం-నెల` అనే మూడు విధాలుగా ల‌క్ష్యాల‌ను నిర్దేశించుకోవాల‌ని చంద్ర‌బాబు సూచించారు. ఏ రోజు ఎంత ప‌నిచేయాలో.. ముందుగానే ప్ర‌ణాళిక వేసుకుని.. ఆమేర‌కు అయ్యేలా చూడాల‌న్నారు. అదేవిధంగా వారం, నెల కోసం.. కూడా ప్ర‌ణాళిక‌లు వేసుకుని.. ప‌నులు అదే స‌మ‌యంలో పూర్త‌య్యేలా ప‌క్కా వ్యూహంతో ముందుకు సాగాల‌ని ఆయ‌న మంత్రి నారాయ‌ణ‌, కాంట్రాక్టు సంస్థ‌లు, అధికారుల‌కు దిశానిర్దేశం చేశారు. అదేస‌మ‌యంలో ఎంత మంది ప‌నిచేయాలి.. ప్ర‌స్తుతం ఎంత మంది ప‌నిచేస్తున్నారో.. కూడా తెలుసుకున్నారు.

అవ‌స‌రం అనిపిస్తే.. పొరుగు రాష్ట్రాల నుంచి కూడా కార్మికుల‌ను తీసుకువ‌చ్చి ప‌నులు వేగంగా పూర్తి చేయాల‌న్నారు. వ‌ర్షాకాలం వ‌చ్చేందుకు మరో అయిదారు మాసాల వ‌ర‌కు గ‌డువు ఉంద‌ని.. ఆలోగా నిర్దిష్ట ల‌క్ష్యాల‌ను ఎట్టి ప‌రిస్థితిలో సాధించాల‌ని ఆయ‌న సూచించారు. అనుకున్న ల‌క్ష్యాన్ని అధిగ‌మించి ప‌నులు చేసే సంస్థ‌ల‌కు ప్రోత్సాహ‌కాలు ఇచ్చేందుకు కూడా ప్ర‌య‌త్నిస్తామ‌ని మంత్రికి తెలిపారు. ప్ర‌స్తుతం 57 వేల కోట్ల రూపాయ‌ల ప‌నులు జ‌రుగుతున్నాయ‌ని మంత్రి చెప్ప‌గా.. దీనిని మ‌రింత పెంచాల‌ని చంద్ర‌బాబు తెలిపారు. ఒకేసారి ఒకే స‌మ‌యంలో మ‌ల్టిపుల్ వ‌ర్క్ జ‌రిగేలా ప్ర‌ణాళిక‌లు వేసుకోవాల‌న్నారు.

నియోజ‌క‌వ‌ర్గంతో మీకు ప‌నేంటి?

ఈ సంద‌ర్భంగా మంత్రి నారాయ‌ణ‌ను ఉద్దేశించి సీఎం చంద్ర‌బాబు కీల‌క‌వ్యాఖ్య‌లు చేశారు. త‌ర‌చుగా నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ర్య‌టిస్తున్నార‌ని.. ఇప్పుడు ఆ అవ‌స‌రం లేద‌ని, నిరంత‌రం.. రాజ‌ధాని ప‌నుల‌పైనే దృష్టి పెట్టాల‌ని..నియోజ‌క‌వ‌ర్గంలో స‌మ‌స్య‌ల‌ను అధికారుల ద్వారా తెప్పించుకుని ఇక్క‌డ నుంచే ప‌ర్య‌వేక్షించాల‌ని ఆయ‌న సూచించారు. కేవ‌లం అమ‌రావ‌తి ప‌నుల కోస‌మే ఎక్కువ స‌మయం వెచ్చించాల‌ని సూచించారు. ఏ చిన్న తేడా వ‌చ్చినా.. `రాజ‌ధాని శత్రువులు` మ‌ళ్లీ చెల‌రేగి పోయే ప్ర‌మాదం ఉంద‌ని.. వ్యాఖ్యానించారు. అమ‌రావ‌తి పూర్తి చేసి.. రైతుల‌కు, రాష్ట్ర‌ప్ర‌జ‌ల‌కు అందించాల్సిన క‌ర్త‌వ్యం ప్ర‌భుత్వంపై ఉంద‌ని స్ప‌ష్టం చేశారు.