మావిగన్ క్రెడిట్… జగన్ పై తోసేసిన సజ్జల

తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నోట నుంచి వచ్చిన మావిగన్ పైనే చర్చోపచర్చలు జరుగుతున్నాయి. మావిగన్ లాంటి ఆలోచనలు జగన్ లాంటి వారికే వస్తాయని అధికార కూటమి విమర్శలు గుప్పిస్తుంటే… అమరావతి కంటే మెరుగైన రాజధాని ప్రతిపాదనను జగన్ చేశారంటూ వైసీపీ నేతలు వంత పాడుతున్నారు. తాజాగా మావిగన్ అన్నది జగన్ ఆలోచన కాదని, అది ఎవరో సలహా ఇస్తే జగన్ దానిని వల్లె వేశారన్న వాదనలు ఆసక్తి రేపుతున్నాయి. అయితే మావిగన్ అనేది జగన్ ఆలోచనేనని, దానిని ఏ ఒక్కరో జగన్ కు సలహా రూపంలో ఇవ్వలేదని వైసీపీ రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించారు.

ఏపీకి ఏకైక, శాశ్వత రాజధానిగా అమరావతిని గుర్తించాలంటూ ఏపీ అసెంబ్లీ పంపిన తీర్మానాన్ని పార్లమెంటు ఆమోదిస్తున్న వేళ.. తాడేపల్లిని వీడిన జగన్ బెంగళూరు వెళ్లిపోయారు. జగన్ తాడేపల్లిలో ఉన్నంతవరకూ నోరు మెదపని సజ్జల… జగన్ అలా బయటకు వెళ్లిపోయినంతనే వరుసబెట్టి మీడియా ముందుకు వస్తున్నారు. తాజాగా శనివారం కూడా మీడియా ముందుకు వచ్చిన సజ్జల… మావిగన్ పూర్తిగా జగన్ మదిలో నుంచి పుట్టినదేనని తేల్చి చెప్పారు. వేరెవరో సలహా ఇస్తే దానిని జనానికి చెప్పడానికి జగన్ తెలివి తక్కువ వారు అనుకున్నారా? అని ప్రశ్నించిన సజ్జల… జగన్ నిజమైన నాయకుడని అన్నారు.

మావిగన్ సలహాను ఇచ్చిన జగన్ తో పాటు టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కూడా నాయకుడేనని ఈ సందర్భంగా సజ్జల అన్నారు. నాయకుడు అనే వాడు ఎవరో ఇచ్చే సలహాలతో ముందుకు సాగరని చెప్పిన సజ్జల… ఒకవేళ అలా సలహాలు ఇచ్చినా… వాటిలో ఉత్తమమైనదేది అన్న విచక్షణతో ముందుకు సాగే వాడే లీడర్ అవుతాడని ఆయన అన్నారు. జగన్ మాదిరే చంద్రబాబు కూడా ఈ విషయంలో లీడరేనని ఆయన చెప్పారు. అయితే చంద్రబాబు తన సంపాదన గురించి ఆలోచిస్తే… జగన్ మాత్రం ప్రజల కోసం ఆలోచిస్తారని సజ్జల చెప్పుకొచ్చారు. 

మావిగన్ అన్నది జగన్ బ్రెయిన్ చైల్డ్ అని సజ్జల చెప్పడంతో… జగన్ పైనా, ఆయన నోట నుంచి వచ్చిన మావిగన్ పైనా సెటైర్లు మరింతగా ముదిరాయనే చెప్పొచ్చు. సోషల్ మీడియాలో ఈ విషయంపై లెక్కలేనన్నీ మీమ్స్ హల్ చల్ చేస్తున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలోని పలు ప్రాంతాలు, జగన్ గతంలో ప్రతిపాదించిన మూడు రాజధానులతో పాటుగా, జగన్ సొంత జిల్లా కడప, సొంత నియోజికర్గం పులివెందులలను ప్రస్తావిస్తూ పుట్టుకొస్తున్న ఈ మీమ్ లతో సోషల్ మీడియాలో ఓ రేంజిలో వైసీపీపై ట్రోలింగ్ సాగుతోంది.