అమరావతికి చట్టబద్దత కల్పిస్తూ రూపొందించిన బిల్లుకు పార్లమెంట్ ఉభయ సభలు ఆమోదించటం పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు సంతోషం వ్యక్తం చేశారు. అయితే.. ఈ బిల్లుకు దేశంలోని ఇతర రాష్ట్రాలకు చెందిన పార్టీలు కూడా మద్దతు ఇచ్చాయని.. కానీ, వైసీపీ మాత్రం మద్దతు ఇవ్వకపోవడం దారుణమని వ్యాఖ్యానించారు. ఇది ఆ పార్టీ రాష్ట్రానికి చేసిన ద్రోహమని వ్యాఖ్యానించారు.
పార్లమెంట్లో 50 పార్టీలు ఉంటే వైసీపీ మినహా అన్ని పార్టీలు రాజధానిగా అమరావతికి చట్టబద్దత కల్పించే అంశంపై మద్దతు పలికాయని చంద్రబాబు తెలిపారు. ఈ రాష్ట్రంలో ఓట్లు పొంది, ఇక్కడి నుంచి ఎంపీలుగా ఎన్నికైన వ్యక్తులు మాత్రం రాష్ట్రానికే ద్రోహం చేసేలా వ్యవహరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతికి చట్టబద్దత కల్పించే బిల్లును వైసీపీ నాయకులు పార్లమెంట్లో వ్యతిరేకించారని, ఇది ప్రజలకు ద్రోహం చేయడమేనని అన్నారు.
రాష్ట్రపతి ఆమోదం తర్వాత దీనికి పూర్తి స్థాయి చట్టబద్దత వస్తుందని తెలిపారు. అన్ని విధాలా సహకరించిన ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షాకు ధన్యవాదాలు తెలిపారు. పార్లమెంటులో ఉండే అన్ని రాజకీయ పార్టీలను, ఎంపీలను అభినందిస్తున్నానన్నారు. లోక్సభ స్పీకర్ కు, రాజ్యసభ చైర్మన్ కు కృతజ్ఞతలు తెలియచేస్తున్నామన్నారు. రాజకీయ వైరుద్యాలు, వ్యక్తిగత బేధాభిప్రాయాలు ఉన్నప్పటికీ అన్ని పార్టీలు సహకారం ఇచ్చాయని కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
కానీ ఒక్క వైసీపీ మాత్రమే రాష్ట్ర ప్రజల ప్రయోజనాలకు విరుద్ధంగా వ్యవహరించిందని చంద్రబాబు మండిపడ్డారు. దేశ ప్రయోజనాలు కాపాడేందుకు ప్రాంతీయ పార్టీలు కూడా సహకరిస్తాయని అన్నారు. కానీ రాష్ట్రం నాశనమైనా పర్వాలేదన్నట్టుగా వైసీపీ సభ్యులు పట్టుదలగా వ్యవహరించారని విమర్శించారు.
“అమరావతి నాశనం అయినా పర్వాలేదని అనుకున్నారు. కానీ మనం శాసనం చేసుకున్నాం. కేంద్ర ప్రభుత్వ రాజముద్రతో 5 కోట్ల ఆంధ్రుల ప్రజల ఆశలు, ఆశయాలు నెరవేరాయి. అమరావతిని ఇక భవిష్యత్తులో ఎవరూ ఏమీ చేయలేరు.“ అని చంద్రబాబు ఉద్ఘాటించారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates
