రాజ్యసభలో రచ్చ.. ఎవరీ రేణుక చౌదరి?

తెలంగాణ‌కు చెందిన రాజ్య‌స‌భ స‌భ్యురాలు, కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్ నాయ‌కురాలు రేణుకా చౌద‌రి.. రాజ‌ధాని అమ‌రావ‌తికి చ‌ట్ట‌బద్ధత క‌ల్పించే బిల్లుపై రాజ్య‌స‌భ‌లో మాట్లాడారు. అయితే.. ఆమె.. ఈ సందర్భంగా కేంద్రంలోని మోడీ స‌ర్కారుపై నిప్పులు చెరిగారు. విభ‌జ‌న చ‌ట్టం చేసిన 12 సంవ‌త్స‌రాలు అయ్యాయ‌ని చెప్పిన ఆమె.. ఇప్ప‌టి వ‌ర‌కు ఆ చ‌ట్టంలోని హామీల‌ను ఎందుకు నెర‌వేర్చ‌లేద‌ని నిల‌దీశారు. ఇది కేంద్ర ప్ర‌భుత్వ నిర్ల‌క్ష్యానికి అద్దం పడుతోంద‌న్నారు.

దీనివ‌ల్ల రెండు తెలుగు రాష్ట్రాలు కూడా ఇప్ప‌టికీ అనేక విష‌యాల్లో కిచులాడుకుంటున్నాయ‌ని రేణుకా చౌద‌రి వ్యాఖ్యానించారు. విభ‌జ‌న చ‌ట్టంలో పేర్కొన్న అంశాల‌పై ఇంకా స్ప‌ష్ట‌త రాలేద‌న్న ఆమె.. అనేక సంస్థ‌ల పంపిణీ కూడా జ‌ర‌గ‌లేద‌ని చెప్పారు. అదేవిధంగా నాడు రాజ్య‌స‌భ‌లో ప్ర‌ధాని మ‌న్మోహ‌న్ సింగ్ ఇచ్చిన హామీల‌ను కూడా నెర‌వేర్చ‌కుండా వ‌దిలేశార‌న్నారు. విభ‌జ‌న చ‌ట్టంలోని అంశాల‌ను అమ‌లు చేయ‌డంలో ఇంత ఆల‌స్యం అయినందుకు ప‌రిహారం చెల్లించాల్సిందేన‌ని తేల్చి చెప్పారు.

జ‌గ‌న్ .. విల‌న్‌!

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తికి చ‌ట్ట‌బ‌ద్ధత క‌ల్పించ‌డం గొప్ప అంశ‌మ‌ని రేణుకాచౌద‌రి అన్నారు. జ‌గ‌న్ లాంటి వ్య‌క్తులు.. విల‌న్లుగా వ్య‌వ‌హ‌రించడం వ‌ల్లే.. ఇప్పుడు చ‌ట్ట‌బ‌ద్ధ‌త చేకూరుతోంద‌న్నారు. ఈ ప‌రిణామం ఏపీ ప్ర‌జ‌ల‌కు ఎంతో సంతోషాన్ని ఇస్తుంద‌ని తెలిపారు. రాజ‌ధానిపై నెల‌కొన్న సుదీర్ఘ అస్ప‌ష్ట‌త‌త‌కు నేటితో తెర‌దించిన‌ట్టు అయింద‌న్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు నెల‌కొన్న సందేహాల కార‌ణంగా.. అనేక పెట్టుబడులు వెనక్కిపోయాయ‌న్న ఆమె.. ఇప్పటికైనా మేలు జ‌రుగుతుంద‌న్నారు.

ఇక నుంచి పెట్టుబ‌డులు ఏపీకి త‌ర‌లి వ‌చ్చేందుకు పారిశ్రామిక వేత్త‌ల‌కు న‌మ్మ‌కం క‌లిగేందుకు అవ‌కాశం ఏర్ప‌డింద‌ని రేణుక‌ తేల్చి చెప్పారు. అయితే.. రాజ‌ధాని నిర్మాణానికి కేంద్రం ఇస్తున్న నిధులు ఎన్ని..?  ఇంకా ఎంత ఇస్తారో కూడా స్ప‌ష్ట‌త చేయాల‌ని రేణుకాచౌద‌రి కోరారు. ఈ విష‌యంలో కేంద్రం ఇచ్చిన హామీల‌ను సంపూర్ణంగా నెర‌వేర్చాల్సిందేన‌ని రేణుకా చౌద‌రి డిమాండ్ చేశారు.