జగన్ ‘మావిగన్’… ట్రోల్ మెటీరియల్ అయిందే

‘అమరావతి’ని ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా నిర్ణయిస్తూ ఏపీ అసెంబ్లీ పెట్టిన తీర్మానం మీద ఇటీవలే ఒక టీవీ ఛానెల్లో చర్చా కార్యక్రమం జరిగితే ప్రొఫెసర్ కె.నాగేశ్వర్ ఒక మాట చెప్పారు. రాజకీయంగా ఏదైనా నిర్ణయం బెడిసికొడితే.. దాని మీద స్టాండ్ మార్చుకోవడంలో తప్పేమీ లేదని, ఇంతకుముందు ఫలానా ఉద్దేశంతో ఆ స్టాండ్ మీద ఉన్నామని.. జనాలకు అది నచ్చలేదు కాబట్టి స్టాండ్ మార్చుకుంటున్నామని చెబితే.. జనాలు దాన్ని సానుకూలంగా తీసుకుంటారని..

కేంద్రంలో ఎన్నో ఏళ్లుగా అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ సర్కారు సైతం రైతు చట్టాల విషయంలో వ్యతిరేకత వస్తే.. జనాభిప్రాయానికి వ్యతిరేకంగా వెళ్లలేమంటూ హుందాగా ఆ విషయం చెప్పి ఆ చట్టాలను వెనక్కి తీసుకుందని గుర్తు చేశారు. కానీ అమరావతి విషయంలో దారుణమైన ఎదురు దెబ్బ తగిలినా.. ఎన్నికల్లో చిత్తుగా ఓడినా వైసీపీ తీరు మారలేదని.. మళ్లీ అమరావతి మీద విషం కక్కుతూనే ఉందంటూ ఆయన విమర్శలు గుప్పించారు.

ఈ రోజు అమరావతి విషయంలో వైఎస్ జగన్ అండ్ కో వ్యతిరేకత మరోసారి స్పష్టంగా బయటపడిపోయింది. ఓవైపు పార్లమెంటులో అమరావతి బిల్లును వ్యతిరేకిస్తూ ఎంపీ మిథున్ రెడ్డి బృందం వాకౌట్ చేస్తే.. అదే సమయంలో ఇక్కడ జగన్ ప్రెస్ మీట్ పెట్టారు. ఈ సందర్భంగా పాత పాటే పాడుతూ.. కొత్తగా ‘మావిగన్’ అనే ప్రతిపాదన తీసుకొచ్చారు జగన్.

మచిలీపట్నంలో ‘Ma’, విజయవాడలో ‘Vi’, గుంటూరులో ‘Gun’ తీసుకుని ‘మావిగన్’ అనే కొత్త రాజధానిని అభివృద్ధి చేయాలని ఆయన ప్రతిపాదించారు. ఐతే ఈ ప్రతిపాదన మీద సోషల్ మీడియా స్పందన చూస్తే.. జగన్ చేసిన కొత్త బ్లండర్ ఏ స్థాయిలో వ్యతిరేకత తెచ్చిపెట్టబోతుందో అర్థమవుతుంది.

జగన్ మామూలుగా ప్రెస్ మీట్ పెట్టగానే మీమ్స్ రెడీ అయిపోతుంటాయి. కానీ ఇది వాటన్నింటినీ మించిపోయింది. ఇది నిమిషాల్లో పెద్ద ట్రోల్ మెటీరియల్‌గా మారిపోయింది. జగన్ వీడియోల కింద కామెంట్లు చదివితే.. ఆయన కొత్త ప్రతిపాదన ఎంత కామెడీ అయిందో అర్థమైపోతుంది.

వైసీపీ హ్యాండిల్ పోస్టుల కింద కూడా విమర్శలు, కామెడీలు మామూలుగా లేవు. ఒక్కటంటే ఒక్క పాజిటివ్, సీరియస్ ట్వీట్ లేదు అంటే పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. మామూలుగా జగన్ కోసం పరిగెత్తుకుని వచ్చి డిఫెండ్ చేసే వాళ్లు కూడా సైలెంట్ అయిపోయారంటే ఇది ఎంతగా బూమరాంగ్ అయిందో అర్థమైపోతుంది.