నిఘా ఏమైంది: వైసీపీ కలివిడి రాజకీయం..!

రాష్ట్రంలో ప్రభుత్వానికి పటిష్ఠమైన నిఘా వ్యవస్థ ఉంది. ఇక తరచుగా సీఎం చంద్రబాబు పలు అంశాలపై సర్వేలు కూడా చేయిస్తున్నారు. ముఖ్యంగా ఉచిత ఇసుక నుంచి ప్రభుత్వం అమలు చేస్తున్న సూపర్ సిక్స్ వరకు ప్రజల అభిప్రాయాలు తెలుసుకుంటున్నారు. దీంతో ప్రజల నాడి ఎలా ఉంది, క్షేత్రస్థాయిలో నాయకులు ఎలా వ్యవహరిస్తున్నారు, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఏమేరకు అమలవుతున్నాయి, ఎలాంటి సంతృప్తి వ్యక్తమవుతోంది వంటి విషయాలను తెలుసుకుంటున్నారు.

మరి ఇంత నిఘా ఉన్నప్పటికీ కోనసీమ ఇసుక దోపిడీ వ్యవహారంపై ప్రభుత్వానికి ఎందుకు సమాచారం అందలేదు అనేది కీలకంగా మారింది. ఇదే విషయంపై సీఎం చంద్రబాబు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేశారు. గత ఏడాది కాలంగా కోనసీమ జిల్లాలోని దాదాపు 18 రీచుల్లో ఇసుకను నాయకులు పంచుకుంటున్నారని పెద్ద ఎత్తున మీడియాలో కథనాలు వచ్చేవరకు సర్కారుకు తెలియకపోవడంపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిఘా వ్యవస్థలు, ఉన్నతాధికారులు ఏమి చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు.

ఏం జరిగింది..?

కోనసీమలోని గోదావరి నది నుంచి నాణ్యమైన ఇసుక ఉత్పత్తి అవుతుంది. దీనికి మార్కెట్‌లో డిమాండ్ ఎక్కువ. అయితే ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ఇసుకను ఉచితంగా పంపిణీ చేస్తోంది. దీనిని ప్రభుత్వం వచ్చిన వెంటనే తిరిగి ప్రారంభించింది. అయితే కోనసీమలో వైసీపీ నాయకులు కొందరు, స్థానిక ప్రజాప్రతినిధులు కలిసి ఇసుకను వ్యాపారంగా మార్చేసుకున్నారన్న ఆరోపణలు తెరమీదికి వచ్చాయి. దీనికి కొందరు అధికారులు కూడా సహకరిస్తున్నారని సర్కారుకు సమాచారం అందింది.

ఈ వ్యవహారంపై ఆగ్రహం వ్యక్తం చేసిన చంద్రబాబు గత ఏడాది కాలంగా ఇక్కడ జరుగుతున్న పనులపై నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ఇదే సమయంలో నిఘా ఎక్కడ తప్పిందో కూడా వివరాలు ఆరా తీశారు. నిజానికి క్షేత్రస్థాయిలో కూటమి పార్టీల నాయకులు కలివిడిగా ఉండాలని ఆదేశిస్తే, నాయకులు ఆ విషయాన్ని పక్కన పెట్టి ప్రత్యర్థి పార్టీ నాయకులతో కలిసిపోయి ఇసుకను దారిమళ్లించడాన్ని సీఎం తీవ్రంగా పరిగణిస్తున్నారు. దీనిపై విచారణకు ఆదేశించారు. మరి ఇది ఎలాంటి మలుపు తీసుకుంటుందో చూడాలి.