భారత రాజ్యాంగ చరిత్రలో అరుదైన సన్నివేశానికి బుధవారం (ఏప్రిల్ 1, 2026) వేదిక కానుంది. ఈ ప్రత్యేక సందర్భానికి కారణం ఏపీ రాష్ట్ర రాజధాని అమరావతి కావటం ఒక విశేషమైతే.. ఇప్పటివరకు దేశంలోని మరే రాష్ట్ర రాజధానికి లేని ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చే బిల్లును పార్లమెంటులో ప్రవేశ పెట్టనున్నారు. గతంలో ఏ రాష్ట్ర రాజధాని విషయంలోనూ శాశ్వత రాజధాని అనే పదాన్ని చట్టంలో పొందుపర్చటం జరగలేదు.
అందుకు భిన్నంగా అమరావతి విషయంలో ఈ ప్రక్రియ జరుగుతోంది. అందుకే.. ఈ ప్రక్రియ దేశ చరిత్రలోనే తొలిసారిగా చెప్పాలి. ఇందులో భాగంగా 2014 ఏపీ పునర్విభజన చట్టంలోని సెక్షన్ 5 ప్రకారం హైదరాబాద్ ను పదేళ్ల పాటు ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా పార్లమెంట్ చట్టబద్ధం చేసింది. ఆ గడువు ముగిసిన తర్వాత అది తెలంగాణకు రాజధానిగా మారుతుందని సదరు చట్టంలో పేర్కొన్నారు.
అంతే తప్పించి.. ఆంధ్రప్రదేశ్ కు ఫలానా నగరం రాజధానిగా పేర్కొన్నది లేదు. ఈ నేపథ్యంలో ఆ చట్ట సవరణ ద్వారా అమరావతి పేరును ప్రస్తావించటం ద్వారా ఏపీ రాజధానిగా అధికారిక గుర్తింపును ఇస్తారు. అంతేకాదు.. అమరావతిని శాశ్విత రాజధాని అన్న పదాన్ని చట్టంలో పొందుపర్చటం ద్వారా.. భవిష్యత్తులో ఏపీ రాజధానిని మార్చాలంటే.. అంత సులువుగా మార్చేందుకు వీల్లేని విధంగా చట్టాన్ని రూపొందిస్తున్నారు.
దీంతో.. ఏపీ రాజధాని అమరావతి అన్న విషయంపై ఫుల్ క్లారిటీ రావటంతో పాటు.. రాబోయే రోజుల్లో ఏపీ పాలకులు మారినా.. రాజధానిగా ఉన్న అమరావతిని మార్చాలన్న ఆలోచన మదిలోకి రాకుండా ఉండేలా తగిన జాగ్రత్తలు తీసుకున్నట్లు చెబుతున్నారు. అదే సమయంలో రానున్న రోజుల్లో ఎవరైనా మొండి పాలకుడు వచ్చి.. రాజధానిగా ఉన్న అమరావతికి బదులు వేరే రాజధాని నగరాన్ని ప్రకటించేందుకు ఉండే అవకాశాన్ని కష్టతరం చేయటం మరో ప్రధాన అంశంగా చెప్పాలి.
కొత్తగా ఏర్పడిన రాష్ట్రాలకు సంబంధించిన రాజధానికి సంబంధించి మరెక్కడా లేని విధంగా అమరావతి విషయంలో చోటు చేసుకున్న అంశాల గురించి తెలిసిందే. అందుకే.. భవిష్యత్తులో కొత్త తలనొప్పులకు అవకాశం లేకుండా చేయటమే తాజా ఉద్దేశంగా చెబుతున్నారు. సాధారణంగా రాజధానిని నిర్ణయించే అధికారం ఆయా రాష్ట్రాలకే ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ విషయంలో రాజధాని మార్పుపై తీవ్రమైన రాజకీయ.. న్యాయపరమైన వివాదాలు తలెత్తిన సంగతి తెలిసిందే.
అందుకే.. భవిష్యత్తులో మళ్లీ ఎవరూ మార్చలేని విధంగా పార్లమెంటు ద్వారా అమరావతిని ఏకైక శాశ్విత రాజధానిగా ఖరారు చేస్తూ కొత్త చట్టాన్ని తీసుకొచ్చే బిల్లును ప్రవేశ పెడుతున్నారు. ఇలా ఒక కేంద్ర చట్టంలో రాష్ట్ర రాజధాని పేరును చేర్చటం భారత రాజ్యాంగ చరిత్రలోనే ఇదే తలొసారి కావటం గమనార్హం.
తాజా బిల్లుతో ఏపీ పునర్విభజన చట్టానికి చేస్తున్న సవరణ ఏంటి?
ఏపీ పునర్విభజన (సవరణ) బిల్లు 2026 ద్వారా 2014 నాటి చట్టాన్ని సవరిస్తున్నారు. ఇందులోని సెక్షన్ 5కు సవరణ చేయటం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి వద్ద ఉంటుందన్న పదాన్ని స్పష్టంగా చేరుస్తున్నారు. అంతేకాదు ఈ బిల్లులో అమరావతి అంటే కేవలం ఒక నగరం మాత్రమే కాకుండా ఏపీ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ చట్టం 2014 కింద నోటిఫై చేసిన ప్రాంతాలన్నీ ఇందులో భాగంగా వివరణ ఇవ్వటం గమనార్హం.
ఈ సవరణతో రాజధాని అంశంపై గతంలో ఉన్న అనిశ్చితికి తెరపడుతుంది. చట్టబద్ధత కల్పించటంతో భవిష్యత్తులో వచ్చే ప్రభుత్వానికి సులువుగా రాజధానిని మార్చటానికి వీలుండదు.పార్లమెంటు ఒక ట్టం ద్వారా రాజధాని నగరాన్ని ఖరారు చేసినప్పుడు దాని చట్టపరమైన హోదా లభిస్తుంది. ఇది కేంద్ర రాష్ట్ర అసెంబ్లీ చేసే తీర్మానం కంటే చాలా పవర్ ఫుల్ అన్న సంగతి తెలిసిందే.
ఇక్కడే మరో సందేహం కలుగుతుంది. రాజ్యాంగం రాష్ట్ర రాజధాని గురించి మౌనంగా (అంటే స్పష్టంగా ప్రస్తావించని పరిస్థితుల్లో) ఉన్నందున పార్లమెంటు తన శాసన అధికారాన్ని ఉపయోగించి చట్టం చేయొచ్చు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఈ మార్చి 28న అమరావతిని శాశ్వత రాజధానిగా గుర్తించాలని ఏకగీవ్రంగా తీర్మానం చేసి కేంద్రానికి పంపారు. రాష్ట్ర విన్నపం మేరకు కేంద్రం ఈ సవరణ బిల్లును తీసుకొస్తోంది. పార్లమెంటులోని రెండు సభలు దీనిని ఆమోదించి.. రాష్ట్రపతి సంతకం చేస్తే అది చట్టబద్దం అవుతుందన్నది మర్చిపోకూడదు.
ఒకసారి పార్లమెంట్ చట్టంలో అమరావతి పేరు చేరిన తర్వాత ఫ్యూచర్ లో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం దానిని మార్చాలన్నా సాధ్యం కాదు. కారణం.. మళ్లీ పార్లమెంటులో చట్ట సవరణ జరిగితే తప్ప రాజధానిని మార్చే వీలుండదు. అందుకే.. అమరావతికి రాజ్యాంగ పరమైన రక్షణతో సమానమైనచట్టపరమైన భరోసా లభిస్తుందన్నది మర్చిపోకూడదు. మొత్తంగా చూస్తే.. గతాన్ని పాఠంగా తీసుకొని.. మళ్లీ అలాంటి పరిస్థితులు చోటు చేసుకోకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల మీద సమాచారం ఇస్తే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆ దిశగా ఇప్పుడు అడుగులు పడుతున్నాయి.
Gulte Telugu Telugu Political and Movie News Updates
