రాజకీయాల్లో జంపింగులు కొత్తకాదు. ఎవరికి నచ్చిన దిక్కుకు వారు వెళ్లిపోవడమూ కొత్తకాదు. ఎవరికి అవసరం.. అవకాశం ఉన్న దిశగా నాయకులు, పార్టీలు కూడా ప్రయాణిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఏ పార్టీ కూడా దీనికి మినహాయింపు కాదు.. ఏనాయకుడు కూడా దీనికి అతీతం కాదు. `జగనన్నే నా ప్రాణం` అన్న నాయకులు.. `టీడీపీలోనే పుట్టి పెరిగాం“.. అన్న నేతలు.. అనేక మంది రాజకీయాల్లో తమ తమ దారులు వెతుక్కున్నారు. తమ అవసరాలు.. అవకాశాలను బలోపేతం చేసుకున్నారు.
ఇలానే ఇప్పుడు మరో షాకింగ్ న్యూస్ వెలుగు చూసింది. వైసీపీకి చెందిన కీలక నాయకుడు, జగన్కు వ్యాపార భాగస్వామి కూడా అయిన.. రాజ్యసభ సభ్యుడు ఒకరు.. బీజేపీవైపు చూస్తున్నట్టు ఢిల్లీరాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. ఆయన ఉమ్మడి గుంటూరు జిల్లాలోని ఓ మాజీ ఎమ్మెల్యేకు స్వయానా సోదరుడు కావడం కూడా గమనార్హం. అంతేకాదు.. జగన్ సామాజిక వర్గానికే చెందిన ప్రముఖ వ్యాపార వేత్త, కాంట్రాక్టర్. ప్రస్తుతం ఆయన వైసీపీలోనే ఉన్నారు.
ప్రస్తుతం పెద్దల సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న సదరు నాయకుడి పదవీ కాలం మరో రెండు మాసాల్లోనే ముగియనుంది. ఈ ఏడాది జూన్తో ఆ పదవిని త్యాగం చేయాలి. ఆ తర్వాత.. వైసీపీకి ఉన్న బలాన్ని బట్టి.. ఆయన ఏ సభకూ.. ప్రాతినిధ్యం వహించే అవకాశం ఉండదు. పైగా.. తన వ్యాపారాలను కాపాడుకోవాలంటే ఖచ్చితంగా ఆయనకు రాజకీయంగా మద్దతు అవసరం. ఇప్పటికే తెరచాటున సదరు నాయకుడు.. బీజేపీకి మద్దతుగా వ్యవహరిస్తున్నారు. పైగా.. దేశవ్యాప్తంగా ఆయన కంపెనీ కాంట్రాక్టు పనులు కూడా చేస్తోంది.
ఇటు రాష్ట్రంలోనూ.. అటు కేంద్రంలోనూ మారుతున్న రాజకీయ పరిణామాలను.. అంచనా వేస్తున్న సదరు నాయకుడు తనకు నచ్చిన విధంగా కాకుండా.. తన వ్యాపారాల పరంగా నిర్ణయం తీసుకునేందుకు రెడీ అయ్యారని తెలిసింది. దీనిలో భాగంగా ఆయన ఇక, బీజేపీలోకి నేరుగా చేరిపోవాలని భావిస్తున్నారు. అన్నీ అనుకూలిస్తే.. ఆయన మరో నెల రోజుల్లోనే కాషాయ కండువా కప్పుకోవడం ఖాయమని తెలుస్తోంది. తద్వారా.. ఏపీ సహా.. ఇతర రాష్ట్రాల్లో చేపడుతున్న కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులను దక్కించుకోవాలన్నది ఆయన వ్యూహం. దీనిపై పెద్ద ఎత్తున వైసీపీలో చర్చ సాగుతోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates